హైదరాబాద్ : గొలుసు దొంగల కోసం పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. నిన్న ఒక్కరోజే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు గంటల వ్యవధిలో దొంగలు రెచ్చిపోయారు. 7 చోట్ల చైన్ స్నాచింగ్స్ కు పాల్పడ్డారు. గోలుసు దొంగల కోసం పోలీసులు అన్ని చోట్ల గాలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకాబంది నిర్వహించి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. చైన్ స్నాచర్ల ఫోటోలతో రోడ్లపై తనిఖీలు చేస్తున్నారు. ఫోటోల్లోని వ్యక్తులను గుర్తించినట్లయితే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.
బంజారాహిల్స్ లో తనిఖీలు
పెన్షన్ ఆఫీసు సర్కిల్ వద్ద బంజారాహిల్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 7 చోట్ల చైన్ స్నాచింగ్ కేసులు నమోదుకావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మాసబ్ ట్యాంక్ నుంచి పెన్షన్ ఆఫీసుకు వచ్చే రూట్ తో పాటు బంజారాహిల్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాక్యుమెంట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
2 గంటల్లో 7 చోట్ల చైన్ స్నాచింగ్స్
వృద్ధులను టార్గెట్గా చేసుకొని వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు 24 తులాల బంగారాన్ని చోరీ చేశారు. పూలు కావాలి.. పాలు కావాలి.. ఇంటి అడ్రస్ కావాలి అంటూ వివిధ సాకులతో వృద్ధులకు దగ్గరగా వెళ్లి చైన్ స్నాచింగ్స్ కు పాల్పడ్డారు. నిన్న ఉదయం వేళ సిటీ పరిధిలో రెండే రెండు గంటల వ్యవధిలో 7 చోట్ల చైన్ స్నాచింగ్స్ చేశారు. ఇక వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలోనూ ఇదే తరహాలో ఒక చోరీ జరిగింది. వరుస చైన్ స్నాచింగ్స్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఈ ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్ఫోన్ టవర్ల లొకేషన్స్, గతంలో ఇదే తరహా దొంగతనాలు చేసిన వారి సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
చైన్ స్నాచింగ్కు దుండగులు ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అది రామ్కోఠికి చెందిన దత్తాత్రేయ గణేశ్ పూరి పేరుతో రిజిస్టర్ అయ్యి ఉన్నట్లు గుర్తించారు. ఆ బైక్ అబిడ్స్ పీఎస్ పరిధిలో చోరీకి గురైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీ,యూపీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠానే ఈ పని చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. త్వరలోనే దొంగలను అరెస్టు చేస్తామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.