మక్తల్, వెలుగు: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసుతో నిందితులు నలుగురిదీ నారాయణపేట జిల్లా మక్తల్ మండలమే. ప్రధాన నిందితుడు మహ్మద్ పాషాది జక్లేర్ గ్రామం కాగా, మిగతా ముగ్గురు నవీన్, శివ, చెన్నకేశవులుది గుడిగండ్ల గ్రామం. మహ్మద్ పాషా మూడేండ్ల క్రితం జక్లేర్ గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు. తర్వాత లారీ డ్రైవర్గా మారాడు. అప్పటి నుంచి తాగుడుకు అలవాటుపడ్డట్లు స్థానికులు తెలిపారు. నవీన్, శివ , చెన్నకేశవులు చిన్నప్పటి దోస్తులు. మహ్మద్ పాషా, నవీన్ లారీ డ్రైవర్లు కాగా.. వాళ్లు నడిపే లారీలకు శివ, చెన్నకేశవులు క్లీనర్లు. చెన్నకేశవులుకు ఏడాది క్రితం పెండ్లి కాగా.. భార్య ఇప్పుడు ఆరునెలల గర్భిణి.
హత్య చేసిన తర్వాత రాత్రికి ఇంటికి
ప్రియాంకా రెడ్డిపై అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత నిందితులు తమకేమీ తెలియనట్టు గురువారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో సొంతూళ్లకు చేరుకున్నారు. వీరు గ్రామానికి చేరుకున్న రెండు గంటలలోపే ట్రాన్స్పోర్టు యాజమాని శ్రీనివాస్రెడ్డితో కలిసి స్పెషల్ పార్టీ పోలీసులు గుడిగండ్ల, జక్లేర్ గ్రామాలకు వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామునే పెద్దసంఖ్యలో పోలీసులు రావడంతో ఆయా ఊళ్ల ప్రజలు ఉలిక్కిపడ్డారు. నవీన్, చెన్నకేశవులు ఇండ్లకు కుటుంబసభ్యులు తాళాలు వేసి ఎక్కడికో వెళ్లిపోయారు.