- ఏజీఆర్ బకాయిల చెల్లింపుపై నాలుగేళ్ల మారటోరియం నూరు శాతం ఎఫ్డీఐ
న్యూఢిల్లీ: చాలాకాలంగా శుభవార్తలకు నోచుకోని టెలికం రంగానికి ఎట్టకేలకు ఊరట దొరికింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రిలీఫ్ ప్యాకేజ్ను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వోడాఫోన్ ఐడియాకు ఈ రిలీఫ్ ప్యాకేజ్ ఆక్సిజన్ కానుండగా, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియోలకూ మేలు జరగనుంది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటించడంతోపాటు, ఇండస్ట్రీకి ఊతమిచ్చే సంస్కరణలనూ తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. బుధవారం నాటి కేబినెట్ సమావేశం రిలీఫ్ ప్యాకేజ్ ప్రపోజల్స్కు ఆమోదం తెలిపింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) లెక్కింపు పద్ధతిలో మార్పులతోపాటు, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలనూ తగ్గించనున్నారు. కేబినెట్ మీటింగ్ తర్వాత కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 9 స్ట్రక్చరల్ రిఫార్మ్స్ను టెలికం రంగం కోసం ఆమోదించినట్లు చెప్పారు.
వోడాఫోన్కి ఊరట...
టెలికం రిలీఫ్ ప్యాకేజ్ వోడాఫోన్ ఐడియాకు ప్రాణం పోయనుంది. దివాలా అంచులకు చేరిన ఈ కంపెనీకి బిజినెస్ను మెరుగుపరుచుకునే ఛాన్స్ ఇవ్వనుంది. వోడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిల కింద కేంద్ర ప్రభుత్వానికి మొత్తం రూ. 50,399 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల చెల్లింపులకు కంపెనీకి కొంత వెసులుబాటు దొరుకుతోంది. వాడుకోని స్పెక్ట్రమ్ను సరెండర్ చేసే వీలునూ రిలీఫ్ ప్యాకేజ్ కల్పిస్తోంది. వాడుకునే వారు మాత్రం మారటోరియం మొత్తం మీద వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నాన్ టెలికం రెవెన్యూను ఏజీఆర్ నుంచి మినహాయించాలని కూడా నిర్ణయించారు. అంతేకాదు, లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్ యూజర్ ఛార్జీలపై పెనాల్టీలను పూర్తిగా ఎత్తివేశారు. టెలికం ఆపరేటర్లు స్పెక్ట్రమ్ను షేర్ చేసుకోవడానికి అనుమతినీ ప్రకటించారు. ఎక్విప్మెంట్ను ఈజీగా దిగుమతి చేసుకోవడానికి వీలు కల్పించేలా 1953లోని కస్టమ్స్ నోటిఫికేషన్ను రద్దు చేశారు. టెలికం రంగంలో ఆటోమేటిక్ రూట్లో నూరు శాతం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్డీఐ) అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది. టెలికం సెక్టార్ బాగు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటిదాకా ఆటోమేటిక్ రూట్లో 49 శాతం దాకా ఎఫ్డీఐకే వీలు ఉండేది. ఆ తర్వాత గవర్నమెంట్ రూటులోనే అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చేది. టెలికం ఇండస్ట్రీలోని కొంత మంది ప్లేయర్లు డబ్బు లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులలో కొంత మేర ఈ నిర్ణయంతో బెనిఫిట్ పొందుతాయని మంత్రి పేర్కొన్నారు. ఎఫ్డీఐ పెంపుదల వల్ల టెలికం రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని ఆశిస్తున్నారు. కొత్తగా మరిన్ని పెట్టుబడులు వస్తాయనేది ప్రభుత్వ ఆలోచన. టెలికం సంబంధ ఆక్షన్లన్నీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ చివరి క్వార్టర్లోనే ఉంటాయని కూడా అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.ఏజీఆర్ బకాయిల చెల్లింపుపై 2020లో సుప్రీం కోర్టు తీర్పు దేశంలోని టెలికం కంపెనీలపై పెద్ద ప్రభావాన్నే చూపెట్టింది. ముఖ్యంగా ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు ఒకేసారి భారీ మొత్తాలను చెల్లించాల్సి అవసరం వచ్చింది. ఈ నిర్ణయం వాటి వ్యాపారాలను దెబ్బకొట్టింది. ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్లు కేంద్ర ప్రభుత్వానికి రూ. 92 వేల కోట్ల లైసెన్స్ ఫీ, రూ. 41 వేల కోట్ల స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలను టెలికం డిపార్ట్మెంట్కు చెల్లించాల్సి ఉంది.
టెలికం షేర్ల జోరు
కేంద్ర ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించడంతో టెలికం షేర్లకు డిమాండ్ పెరిగింది. భారతి ఎయిర్టెల్ షేర్లు బీఎస్ఈలో 4.53 శాతం పెరగ్గా, వోడాఫోన్ ఐడియా షేర్లు 2.76 శాతం జంప్ చేశాయి. టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) షేర్లు 4.94 శాతం, టాటా కమ్యూనికేషన్స్ షేర్లు 1.38 శాతం ఎగిశాయి. డబ్బు లేక ఇబ్బందిపడుతున్న టెలికం కంపెనీలకు ఏజీఆర్ బకాయిల చెల్లింపు మారటోరియం ఎంతో మేలు చేస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రేటజిస్ట్ వీ కే విజయకుమార్ చెప్పారు. మారటోరియం నిర్ణయం బ్యాంకులకు కూడా మంచి చేస్తుందని పేర్కొన్నారు.
రూ.26 వేల కోట్ల విలువైన పీఎల్ఐ స్కీమ్కు ఓకే
ఆటో, ఆటో కాంపొనెంట్స్, డ్రోన్ ఇండస్ట్రీలు మరింత ఎదిగేలా చేయడానికి రూ.26,058 కోట్ల విలువైన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. ఆటోమోటివ్ టెక్నాలజీలను ఎంకరేజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఐదేళ్లపాటు ఈ ఇండస్ట్రీలకు రూ.26 కోట్ల విలువైన రాయితీలు ఇస్తామన్నారు. ఫలితంగా కొత్తగా రూ.42,500 కోట్ల విలువైన ఇన్వెస్ట్మెంట్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అదనంగా రూ.2.3 లక్షల కోట్ల విలువైన ప్రొడక్షన్ జరుగుతుంది. 7.5 లక్షల మందికి జాబ్స్ వస్తాయి. ప్రస్తుత ఆటోమోటివ్ కంపెనీలతోపాటు కొత్త ఇన్వెస్టర్లూ పీఎల్ఐ స్కీమును ఉపయోగించుకోవచ్చు. ఇందులో చాంపియన్ ఓఈఎం ఇన్సెంటివ్ స్కీమ్, కాంపొనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీములు ఉంటాయి. బ్యాటరీ ఈవీలు, హైడ్రోజన్ ఫ్యూయల్ వెహికల్స్ను ఎంకరేజ్ చేయడానికి ఓఈఎం చాంపియన్ స్కీము ఉపయోగపడుతుంది.