టీఎస్ పీఎస్ సీ( TSPSC) పేపర్ లీక్ పై ఉద్యమానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఏప్రిల్ 25న సీఎం నియోజకవర్గం గజ్వేల్ లో నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తామని పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు నేతలు. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీపై ఉద్యమం ఉదృతం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 25న గజ్వేల్ లో నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు రేవంత్.
కాంగ్రెస్ ఫిర్యాదులో ఈడీ కేసు నమోదు
టీఎస్ పీఎస్ సీ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు రేవంత్. మంత్రి కేటీఆర్ ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్ సీ తీగ లాగితే ప్రగతి భవన్ లింగ్ బయటపడిందన్నారు. టీఎస్ పీఎస్ సీ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఫిర్యాదుతో టీఎస్పీఎస్ సీ పేపర్ లీక్ పై ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు.
10 నుంచి 25 వరకు హాత్ సే హాత్ జోడో యాత్ర
రాహుల్ పై అనర్హత వేటు, టీఎస్ పీఎస్ సీ పేపర్లీక్ పై జనంలోకి వెళ్తామన్నారు రేవంత్. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఏప్రిల్ 3 నుంచి పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడ్తామని చెప్పారు. ఏప్రిల్ 8న మంచిర్యాలలో సత్యాగ్రహ నిరసన దీక్ష, 10 నుంచి 25 వరకు హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తామన్నారు. 20 నుంచి 25 వరకు జుక్కల్ నుంచి పాదయాత్ర జరుగుతుందని వెల్లడించారు. అదానీ ఇష్యూపై పార్లమెంట్ లో రాహుల్ ప్రశ్నించారన్న రేవంత్.. రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ, అదానీ, అమిత్ షా పగబట్టారని ఆరోపించారు. రాహుల్ పై కక్షపూరితంగా అనర్హత వేటు వేశారని విమర్శించారు.
ప్రధాన కార్యదర్శులపై పీసీసీ అసంతృప్తి
పార్టీ సమావేశాలకు డుమ్మా కొట్టిన ప్రధాన కార్యదర్శులను తొలగించాలని పీసీసీ నిర్ణయం తీసుకుంది. వరుసగా ఐదు సమావేశాలకు రాని ప్రధాన కార్యదర్శులకు నోటీసులిచ్చి తొలగిస్తామని రేవంత్ అన్నారు. పార్టీ కోసం పనిచేయని ప్రధాన కార్యదర్శులు ఎందుకని ప్రశ్నించారు. వరుసగా ఐదు సమావేశాలకు రాని ప్రధాన కార్యదర్శులకు నోటీసులిచ్చి 24 గంటల్లో తొలగిస్తామని చెప్పారు.