త్వరలో రూపే క్రెడిట్ కార్డులను లాంఛ్ చేయనున్నట్లు స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ప్రకటించింది. క్రెడిట్ కార్డుల విభాగంలో ప్రస్తుతం యూఎస్ కు చెందిన మాస్టర్, వీసా గేట్ వేల అధిపత్యమే నడుస్తోంది. ఈ రెండు సంస్థలకు ధీటుగా నేషనల్ పేమెంట్ స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) రూపే పేమెంట్ నెట్ వర్క్ను అందుబాటులోకి తెచ్చింది. రిటైల్ పేమెంట్ స్, సెటిల్ మెంట్ సిస్టమ్స్ ను ఈ ఎన్ పీసీఐ నిర్వహిస్తోంది. రూపే క్రెడిట్ కార్డును తెచ్చేందుకు ఎన్ పీసీఐతో మరొక ఒప్పం దం మాత్రమే కుదుర్చుకోవల్సి ఉందని, అది ఏ రోజైనా రావొచ్చని భావిస్తున్నామని ఎస్ బీఐ కార్డ్ ఎండి, సీఈఓ హర్ దయాళ్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూపే క్రెడిట్ కార్డును తీసుకురాగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇండియాలో రూపే క్రెడిట్ కార్డుకు మంచి ఆదరణ వస్తుందనే నమ్మకం ఉందని, ఎలాంటి సందేహాలూ లేవని ప్రసాద్ చెప్పారు. రూపే కార్డులు కావాలని పట్టుపడుతున్నారని తెలిపారు.
ఇండియాలో ఎస్ బీఐ జారీ చేస్తున్న కార్డులలో మూడో వంతు కార్డులు రూపే కార్డులే ఉంటున్నాయి. రూపే కార్డులను ఇష్టపడుతున్న కస్టమర్లు కొందరున్నారు. మాకు రూపే కార్డులే ఇవ్వండని, ఆ కస్టమర్లు అడుగుతున్నారని ప్రసాద్ వెల్లడించారు. రూపే కార్డులతోపాటు, విదేశాలకు వెళ్లే వారికోసం మాస్టర్, వీసా కార్డులనూ జారీ చేస్తామని చెప్పారు. రూపే కార్డులను ప్రస్తుతం కొన్ని దేశాలలోనే అంగీకరిస్తున్నారు. సింగపూర్, భూటాన్ , యూఏఈతోపాటు, మరికొన్ని దేశాలలో మాత్రమే రూపే కార్డులతో చెల్లింపులకు ప్రస్తుతం వీలుంది. డిస్కవర్ , జపాన్ క్రెడిట్ బ్యూరో, చైనా యూనియన్ పే వంటి దిగ్గజాలతో రూపే ఒప్పందాలు కుదుర్చుకుంది. అంతర్జాతీయంగా రూపే కార్డులకు ఆమోదం పెరిగేందుకే ఈ ఒప్పందాలు చేసుకున్నారు.
కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీస్ అందించేందుకు తమ చాట్ బాట్ ‘ఇలా’ ను మొబైల్ యాప్ లోనే అందుబాటులోకి ఎస్ బీఐ కార్డ్ తెచ్చిందని ప్రసాద్ తెలిపారు. కార్డుల వాడకాన్ని ఇలా మరింత సులభతరం చేస్తోందన్నారు. మొత్తం 40కి పైగా ఫీచర్స్ తో దీనిని తెచ్చినట్లు వెల్లడించారు. కార్డుల రంగంలో చాట్ బాట్ ను మొదటగా తెచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 1.40 కోట్ల సందేహాలను ఇలా 97 శాతం యాక్యురసీతో పరిష్కరించిందని వివరించారు. జూలై 2019 నాటికి ఎస్ బీఐ కార్డ్కు 90 లక్షల మంది కస్టమర్లున్నారు. ఇండియాలోని క్రెడిట్ కార్డుల మార్కెట్లో ఎస్ బీఐ కార్డ్కు 17.9 శాతం వాటా ఉంది. డిసెంబర్ 2018 నుంచి ప్రతి నెలా 3 లక్షల కొత్త కార్డులను ఎస్ బీఐ కార్డ్ జారీ చేస్తోందని కూడా ప్రసాద్ వెల్లడించారు.