ముగ్గురు అరెస్టు, మరో ముగ్గురు పరారీ
గచ్చిబౌలి, వెలుగు: డేటింగ్ వెబ్ సైట్ల పేరుతో మేల్ ఎస్కార్ట్స్ గా పంపిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ శుక్రవారం వెల్లడించారు. సైబరాబాద్కు చెందిన ఓ వ్యక్తి మేల్ ఎస్కార్ట్ జాబ్ కోసం కోల్ కత్తా వేదికగా రన్ అవుతున్న ఇండియన్ ఎస్కార్ట్ సర్వీస్ పేరుతో నడిచే ఓ వెబ్సైట్లో రిజిస్ట్రర్ చేసుకున్నాడు. ఆ తర్వాత సదరు కంపెనీ నుంచి నేహ, రీమ, కరణ్ అనే అమ్మాయిలు కాల్ చేసి మేల్ ఎస్కార్ట్ జాబ్స్ ఉన్నాయని, అందుకు డబ్బులు కట్టాలని చెప్పారు. దీంతో వివిధ ఫీజుల రూపంలో సదరు వ్యక్తి రూ. 13, 82, 643 పేమెంట్ చేశాడు. ఆ తర్వాత లేట్ ఫీజు, జీఎస్టీ ఫీజులు అని చెప్పడంతో మరో రూ. 1.50 లక్షలు వారు సూచించిన బ్యాంక్ అకౌంట్కు పంపించాడు. డబ్బులు కట్టిన తర్వాత జాబ్ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
మరో కేసులో షాద్నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సెప్టెంబర్ 15న ఫిమేల్ ఎస్కార్ట్ జాబ్ కోసం వెతుకుతూ ఓ వెబ్సైట్లో పోస్ట్ చూసి రిజిస్ర్టర్ చేసుకున్నాడు. కొద్ది సమయానికి సదరు కంపెనీ నుంచి త్రిష అనే అమ్మాయి కాల్ చేసి జాయినింగ్ మెంబర్ షిప్ కోసం, జీఎస్టీ కోసం, హోటల్ బుకింగ్ కోసమని చెప్పి బాధితుడి వద్ద రూ. 1,15,700 కట్టించుకుంది. ఆ తర్వాత జాబ్ రాకపోవడంతో తనను చీటింగ్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ రెండు కంప్లైంట్స్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇన్వెస్టిగేషన్లో డేటింగ్ వెబ్సైట్ల పేరుతో మోసాలకు పాల్పడుతుంది వెస్ట్బెంగాల్కు చెందిన గ్యాంగ్గా గుర్తించారు. ఈ గ్యాంగ్లోని బిజయ్కుమార్, వినోద్ కుమార్, మహ్మద్ నూర్ ఆలమ్ అన్సారీలను వెస్ట్బెంగాల్లో అరెస్ట్ చేసి నగరానికి తీసుకువచ్చారు. మరో ముగ్గురు నిందితులు సంతుదాస్, అమిత్పాల్, సుషాంక్కుమార్లు పరారీలో ఉండగా, వారి ఇండ్లకు నోటీసులు ఇచ్చారు. వీరి వద్ద నుంచి ఒక ల్యాప్టాప్, 31సెల్ఫోన్లు, 12 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.