దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రతరమౌతోంది. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ రాష్ట్రాలను మరోసారి అలర్ట్ చేసింది. లాక్డౌన్ సడలింపులు ఇస్తోన్న అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలు రాసి కీలక సూచనలు చేశారు. వలస కూలీలను బస్సులు, శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు పంపించాలని ఆయన చెప్పారు. వారిని రోడ్డు, రైలు పట్టాల వెంట నడవకుండా చర్యలు తీసుకోవాలంది. అంతేకాదు… వలస కూలీల కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన శిబిరాలను కూడా కొనసాగించాలని ఆయన సూచించారు.
వలస కూలీలు స్వస్థలాలకు చేరే వరకు వారికి నీళ్లు, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని అజయ్ భల్లా చెప్పారు. వలస కూలీలకు శ్రామిక్ రైళ్ల వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్యం, పారిశుద్ధ్యం, ప్రైవేటు క్లినిక్లను తెరిచే అంశంపై కూడా అజయ్ భల్లా మరో లేఖ రాసి సూచనలు చేశారు.