స్పేస్ఎక్స్ ఫౌండర్ మస్క్
మీరు అంగారక గ్రహంపైకి వెళ్లి సెటిలవ్వాలని అనుకుంటున్నారా? అక్కడ ఉద్యోగం కూడా కావాలా? అయితే వెంటనే స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ను సంప్రదించండి! ఎందుకంటే.. ఆయన మార్స్పై ఓ సిటీని కట్టబోతున్నారట. దాదాపు10 లక్షల మందికి సరిపోయేంత ఆ సిటీని 2050 నాటికి సిద్ధం చేసి, మనుషులను తరలిస్తారట. అంతేకాదు.. అక్కడ ఎంతో మందికి ఉద్యోగాలు కూడా ఇస్తారట. గురువారం ట్విటర్లో వరుస ట్వీట్లతో ఎలాన్ మస్క్ ఈ సంగతులు వెల్లడించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. మనుషులను మార్స్ పైకి పంపేందుకు ఏటా100 కొత్త స్టార్ షిప్లు తయారు చేస్తారు. మొత్తంగా పదేళ్లలో వెయ్యి స్టార్ షిప్లు సిద్ధం చేస్తారు. రీయూజబుల్ రాకెట్లతో కూడిన ఈ స్టార్ షిప్ లు ప్రతి రోజూ మూడు చొప్పున మార్స్ కు బయలుదేరుతాయి. ప్రతి 26 నెలలకు ఓ విడతలో వెయ్యి స్టార్ షిప్ ట్రిప్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో 100 మంది వెళ్లొచ్చు. మనుషులు బతికేందుకు కావలసిన సరుకులు, ఫుడ్ను కూడా ఈ రాకెట్ల ద్వారానే ట్రాన్స్ పోర్ట్ చేస్తామని తెలిపారు.