హైదరాబాద్, వెలుగు: సైబర్ క్రిమినల్స్ను వెంటాడేందుకు స్పెషల్ కాప్స్ వస్తున్నారు. స్పెషల్ ట్రైనింగ్తో ప్రతి కానిస్టేబుల్ ఓ సైబర్ పోలీస్గా మారబోతున్నారు. ఇందుకోసం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేలా పోలీసింగ్ నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల కంటే ముందే టెక్నాలజీని ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ అకాడమీలో ట్రైనింగ్, రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ట్రైనింగ్సెంటర్లు, పోలీస్ స్టేషన్లలో స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. సైబర్ నేరాలను గుర్తించడం, క్రిమినల్స్ను ట్రాక్ చేయడంలో నిపుణులు, సీనియర్ ఆఫీసర్లతో స్పెషల్ క్లాసులు, క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిరుడు హైదరాబాద్లో 350 శాతం పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు
ఆన్లైన్ అడ్డాగా సాగుతున్న సైబర్ క్రైమ్లో నేరగాళ్లు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు గుర్తించలేని విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం 28 రకాలకు పైగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. నిరుడు రాష్ట్రంలో 103% , గ్రేటర్ హైదరాబాద్లో 350% సైబర్ నేరాలు రిపోర్ట్ అయ్యాయి. ఇందులో లోన్ యాప్స్, స్పూఫింగ్, ఫిషింగ్ మెయిల్స్, క్లోనింగ్, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు అధికంగా ఉన్నాయి. పోలీసుల కంటే ముందుగానే సైబర్ నేరగాళ్లు టెక్నాలజీకి అప్డేట్అవుతుండటంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీంతో సైబర్ క్రైమ్ కేసుల్లో ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాకపోవడంతో బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది.
స్పెషల్ క్లాసులు
ఏటా పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. నేరాలను ముందుగానే గుర్తించి వాటిని నిరోధించడంపై దృష్టి పెట్టారు. నిరుడు సైబర్ వారియర్స్గా 1,988 మంది పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చారు. సైబర్ నిపుణులతో అన్ని పోలీస్ స్టేషన్స్లోని సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నేరగాళ్లు ఉపయోగించిన ఫోన్ నంబర్స్, బ్యాంక్ అకౌంట్స్, క్రిమినల్స్ హిస్టరీని కానిస్టేబుల్ నుంచి సీనియర్ స్థాయి అధికారుల వరకు ట్రాక్ చేయవచ్చు. ఇందు కోసం దేశవ్యాప్తంగా నమోదైన కేసులు, ఆయా రాష్ట్రాల పోలీసులతో కోర్డినేషన్తో సైబర్ నేరాలపై అధ్యయనం చేస్తారు. ఆన్లైన్లో అనుమానిత సైట్ల గుర్తింపు,ఫేక్ లింక్స్ను విశ్లేషించడం, ఎలాంటి వెబ్పేజ్లో సైబర్ నేరగాళ్లు ఉంటారో వివరిస్తారు. ఇవే విషయాలను ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులకు వివరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమస్యగా
క్రమంగా జరిగే ప్రాపర్టీ క్రైమ్, హత్యలు, స్నాచింగ్స్ సహా ఎలాంటి నేరం జరిగినా ఛేదించడంలో పోలీసులకు నైపుణ్యం ఉంది. కానీ సైబర్క్రైమ్ కేసుల్లో తక్కువ మందికి మాత్రమే స్కిల్స్ ఉన్నాయి. గతంలో ఎలాంటి సైబర్ చీటింగ్ జరిగినా స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదులు తీసుకునేవారు. ప్రస్తుతం రూ.లక్షకు తక్కువగా ఉన్న కేసులను లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇతర క్రైమ్ కేసులు, బందోబస్తులు ఎక్కువగా ఉండడం సిబ్బందికి సైబర్ నేరాలను ట్రేస్ చేయడంపై అవగాహన తక్కువగా ఉండడంతో బాధితుల నుంచి తీసుకున్న ఫిర్యాదులపై దర్యాప్తు చేయడం లేదు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు సైబర్ క్రైమ్ కేసులపై ప్రత్యేక శిక్షణ ఫలితాలను ఇస్తుందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. నేరం జరిగిన తీరు, బ్యాంక్ అకౌంట్స్, ఫేక్ మొబైల్ నంబర్ల గుర్తింపు వంటి వాటితో దర్యాప్తు వేగంగా జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రజలే కీలక పాత్ర పోషించాలి. అప్రమత్తంగా ఉంటే చాలా నేరాలు తగ్గుతాయి. అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న పోలీసులకు మేము క్లాసులు చెప్తుంటాము. బాధితుని నుంచి పూర్తి సమాచారం సేకరించినప్పుడే కేసులు ట్రేస్ చేయవచ్చు. ఆన్లైన్పై అవగాహన ఉండాలి. మా సిబ్బందికి నెలలో రెండు మూడు సార్లు క్లాసులు చెప్తుంటాము. నేరస్తులు ఎలా అప్డేట్ అవుతున్నారు, వారు వినియోగించే సాఫ్ట్వేర్స్ వివరాలు వంటివి తెలుసుకుంటాం. ఎథికల్ హ్యాకర్లతో కూడా క్లాసులు ఇప్పిస్తాము.
- కేవీఎం ప్రసాద్, ఏసీపీ,
సైబర్ క్రైమ్,హైదరాబాద్