హైదరాబాద్: రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధునాతన టెక్నాలజీని వినియోగిస్తామని అన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణ పై అధికారులతో పాటు ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఎన్నికలను శాంతియుత వాతావరణం లో నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామని చెప్పారు. ఓటర్ లిస్ట్తో పాటు, పోలింగ్ కేంద్రాన్ని ఆన్ లైన్ లో పొందుపరుస్తామని చెప్పారు నామినేషన్ నుంచి ఫలితాల వరకు మొత్తం ప్రక్రియను ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామని చెప్పారు.టెక్నాలజీతో తక్కువ సమయంలో… తక్కువ సిబ్బంది తో ఎన్నికల ను నిర్వహించవచ్చని ఆయన అన్నారు.
త్వరలోనే జీహెచ్ఎంసీ జోనల్ అధికారులతో ఎన్నికల నిర్వహణ పై సమావేశం నిర్వహిస్తామని, 150 పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఒక్కో వార్డు లో ఫేస్ రికగ్నేషన్ యాప్ ను వాడుతామని పార్థసారథి చెప్పారు. ఫేస్ రికగ్నేషన్ యాప్ తో ఓటరు పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగు లకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఓటింగ్(E-voting) విధానం అమలు చేయబోతోందని అన్నారు. వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈ ఓటింగ్ (E-voting) విధానం అమలు చేసేలా ఐటీ శాఖతో సమన్వయం చేసుకుంటున్నామని, ఈ ఓటింగ్ విధానం తో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. టీ పోల్ సాఫ్ట్ వేర్ తో పాటు సాంకేతిక అంశాలపై వచ్చే నెల 23 నుంచి 29 వరకు జోన్ల వారిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పార్థసారథి చెప్పారు.