- ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. 4 సార్లు లేఖ రాసినా స్పందన లేదు
- ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం టాప్ ప్రయారిటీ ఇవ్వండి..
- రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ.. క్లియరెన్స్ లేకపోతే సమస్యలే: ఎక్స్పర్ట్స్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్స్ విషయంలో జాప్యం చేయొద్దని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని రాష్ట్ర సర్కార్కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ అనుమతులపై ఇప్పటికే నాలుగుసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాము సమాధానం కోరామని, అయినా ఎలాంటి స్పందన లేదని పేర్కొంది. ఇకనైనా స్పందించాలని, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్కు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం పరిగణించాల్సిన ప్రాజెక్టు అంచనా వ్యయం స్థాయి రెండేండ్ల కంటే పాతదిగా ఉండొద్దని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
కాళేశ్వరానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ తీసుకోండి
2018 జూన్ 14న అప్పటి అంచనా వ్యయాన్ని బట్టి టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందని సీడబ్ల్యూసీ గుర్తు చేసినట్లు సమాచారం. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఇకనైనా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం ముందుకు రావాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత ధరల స్థాయిలో క్లియరెన్స్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రాజెక్టు విషయంలో గిరిజనులకు ఆశ్రయం కల్పించేందుకు గిరిజన శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని కూడా సీడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలో సూచించినట్లు తెలిసింది.
క్లియరెన్స్ లేకపోతే కష్టమే!
ఇప్పటికైనా కాళేశ్వరానికి ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్స్ తీసుకోకపోతే, ఇప్పటి వరకు ఇచ్చిన అనుమతులు చెల్లకపోవచ్చని నీటి పారుదల రంగానికి చెందిన ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అన్ని అనుమతుల్లో మార్పులు తీసుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్తున్నారు. మరోవైపు రాష్ట్రం భావిస్తున్నట్లు కాళేశ్వరానికి జాతీయ హోదా పొందాలంటే, ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్స్ తప్పనిసరని ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు. ఈ అనుమతులు తొందరగా పొందితేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు.
జ్వరం వస్తే దిక్కులేదు..సర్కారీ ఆస్పత్రుల్లో డాక్టర్లు నర్సుల కొరత