- కోఠి ఈఎన్టీ దవాఖానలోసౌలతులు కరువు
- ఒకరు డిశ్చార్జయితేనే మరొకరికి బెడ్
- ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టు ఉంటేనే అడ్మిషన్
- కరోనా పాజిటివ్ ఉంటే గాంధీ హాస్పిటల్కు
- ఇప్పటికీ రిపేర్కు నోచుకోని సీటీ స్కాన్ మెషీన్
- టెస్టులన్నీ బయట్నే.. ప్రైవేటులో వేలల్లో ఖర్చు
- షుగర్ టెస్టు కూడా చేస్తలేరు
హైదరాబాద్, వెలుగు: బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ కోసం నోడల్ సెంటర్గా ఏర్పాటు చేసిన కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్లో బెడ్స్ ఫుల్ అయ్యాయి. ఒక పేషెంట్ డిశ్చార్జయితేనే మరొకరికి బెడ్ లభించే పరిస్థితి నెలకొంది. పేషెంట్లకు అవసరమైన ఏ టెస్టునూ హాస్పిటల్లో చేయడం లేదు. చివరికి షుగర్ టెస్టును కూడా పేషెంట్లే బయటి నుంచి గ్లూకో మీటర్లు తెచ్చుకొని చేసుకోవాల్సి వస్తోంది. ఈ దవాఖానలో బ్లాక్ ఫంగస్ పేషెంట్ల కోసం 225 బెడ్స్ ఉండగా, ప్రస్తుతం అన్ని ఫుల్ అయ్యాయని డాక్టర్లు చెప్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ ఉండి బ్లాక్ ఫంగస్ బారినపడ్డవాళ్లను గాంధీ హాస్పిటల్కు పంపుతున్నారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈఎన్టీ హాస్పిటల్లో సౌలతులు మాత్రం కల్పించడం లేదు. పాడైన సీటీ స్కాన్ మెషీన్ను ఇప్పటికీ రిపేర్ చేయించలే. ఇన్ పేషెంట్గా చేరినప్పటి నుంచి ఆ టెస్టులు, ఈ టెస్టులంటూ పేషెంట్లను బయటి హాస్పిటళ్లకే తిప్పుతున్నారు. లోపల ఏ టెస్టూ చేయడంలేదు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ, గుండె, డెంటల్ తదితర టెస్టుల కోసం ఉస్మానియా హాస్పిటల్కు, కంటి చెకప్ల కోసం సరోజినిదేవి ఆస్పత్రికి పంపుతున్నారు. ఉస్మానియాలో అన్ని టెస్టులు ఒకే రోజు కావడంలేదు. దీంతో రోజుల తరబడి టెస్టుల కోసమే తిరగాల్సి వస్తోందని, ఫలితంగా ట్రీట్మెంట్కు ఆలస్యమవుతోందని పేషెంట్లు అంటున్నారు. చాలా మంది ప్రైవేట్ ల్యాబ్స్లో టెస్టులు చేయించుకుంటున్నారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, హార్ట్ చెకప్, బ్లడ్ టెస్టులు ఇలా అన్నింటికీ కలిపి ఒక్కో పేషెంట్కు రూ. 15వేల నుంచి 20 వేల దాకా ఖర్చవుతోంది. ఇప్పటికే కరోనా వల్ల లక్షలకు లక్షల అప్పులు చేసి దవాఖాన్లలో చూపెట్టుకున్న తాము ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వల్ల మరింత అప్పులపాలవుతున్నామని పేషెంట్లు, వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే ఈఎన్ టీ దవాఖాన ప్రభుత్వాసుపత్రిగా కనిపిస్తోందని, ఒక్క టెస్టు కూడా చేయడం లేదని వారు అంటున్నారు.
షుగర్ టెస్టులూ చేస్తలె
బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నవాళ్లలో ఎక్కువ మంది షుగర్ పేషెంట్లే ఉంటున్నారు. వీళ్లకు రెండు, మూడు పూటల షుగర్ లెవల్స్ చెక్ చేయడం తప్పనిసరి. కానీ హాస్పిటల్లో చేరిన పేషెంట్లకు కనీసం షుగర్ టెస్టులు కూడా చేయడంలేదు. ఎవరికి వాళ్లే టెస్టులు చేసుకోవాలని, ఇందుకోసం గ్లూకో మీటర్లు తెచ్చుకోవాలని స్టాఫ్ చెప్తున్నారని పేషెంట్లు అంటున్నారు.
ఇంజక్షన్లకూ షార్టేజీ
బ్లాక్ ఫంగస్ బారిన పడ్డోళ్లకు లైపోజోమల్, యాంఫోటెరిసిన్ బి, పోసకోనజోల్, ఐసవుకోనజోల్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. మార్కెట్లో ఇంజక్షన్లు దొరకట్లే..బ్లాక్ మార్కెట్లో కొనలేక చాలామంది ఈ ఇంజక్షన్ల కోసమే ఈఎన్టీకి వస్తున్నారు. అయితే హాస్పిటల్లో కూడా ఇంజక్షన్లకు షార్టేజీ ఉంది. అత్యవసరమైనవాళ్లకే ఇస్తున్నారు. అడ్మిషన్ కౌంటర్ వద్ద యాంఫోటెరిసిన్ ఇంజక్షన్లు లేవని స్టిక్కర్ అంటించారు.
బెడ్ కోసం పడిగాపులు
బ్లాక్ ఫంగస్ కేసులు వస్తుండటంతో ఈఎన్ టీలో ముందుగా 30 బెడ్లు ఏర్పాటు చేశారు. బాధితుల సంఖ్య పెరగడంతో ఆ తర్వాత నోడల్ సెంటర్ గా మార్చి బెడ్స్ని పెంచారు. ప్రస్తుతం 225 బెడ్స్ ఉండగా.. అవన్నీ ఫుల్ అయ్యాయి. ప్రస్తుతం ఒక పేషెంట్ బయటకు వస్తేనే మరో పేషెంట్కు అడ్మిషన్ దొరికే పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది పేషెంట్లు హాస్పిటల్ ప్రాంగణంలోనే పడుకుంటున్నారు.
టెస్టులకు 20 వేలు ఖర్చయినయ్
కరోనా వచ్చి తగ్గిందనుకునే టైంలో బ్లాక్ ఫంగస్ వచ్చింది. ట్రీట్ మెంట్ కోసం ఈఎన్టీ హాస్పిటల్కు వస్తే ఇక్కడ టెస్టులు చేస్తలేరు. సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్లు, గుండె, డెంటల్ టెస్టుల కోసం ఉస్మానియా హాస్పిటల్కు పంపుతున్నరు. అక్కడ గుండె టెస్టులకే ఒకరోజు గడిచింది. డెంటల్కి సంబంధించి తెల్లారి రమన్నరు. ఇంకా కన్ను టెస్టులు చేసుకోవాల్సి ఉంది. దాని కోసం సరోజిని హాస్పిటల్కు వెళ్లమన్నరు. ఇక తిరిగే ఓపికలేక స్కానింగ్లు బయటనే తీయించుకున్నం. ఇంకొన్ని టెస్టులు కూడా చేయించినం. వీటికే రూ. 20 వేలు ఖర్చయినయ్. ఈ దవాఖాన్ల షుగర్ టెస్టులు కూడా చేస్తలేరు. గ్లూకో మీటర్ కొనుక్కొని మేమే చెక్ చేసుకుంటున్నం.
– తారా, పేషెంట్, కరీంనగర్ జిల్లా వాసి
మరిన్ని బెడ్స్ పెంచుతం
ప్రస్తుతం పేషెంట్ల సంఖ్య పెరిగింది. దీంతో బెడ్స్ ఫుల్ అవుతున్నయ్. మరో 50 బెడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నం. సీటీ స్కాన్ మెషీన్ రిపేర్ త్వరలో పూర్తవుతది. పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నం. ఎంతమంది పేషెంట్లు వచ్చిన ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
- డాక్టర్ మనీష్ గుప్తా, సీఎస్ ఆర్ఎంవో, ఈఎన్టీ హాస్పిటల్