ఉల్లి ధర ఆకాశాన్నంటుతోంది. సామాన్యుడికి ఉల్లి బంగారంతో సమానంగా కనిపిస్తోంది. కిలో రూ.70 నుంచి 100 వరకు పలుకుతోంది. దీంతో ఉల్లిపాయల వాడకం వీలైనంతగా తగ్గించేశారు జనం.
దొంగలు కూడా ఉల్లికి ఉన్న డిమాండ్ ముందు డబ్బు బలాదూర్ అనుకున్నట్టున్నారు. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లా సుతహత టౌన్లో కూరగాయల షాప్లో చోరీకి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అక్షయ్ దాస్ అనే వ్యక్తి ఉదయం షాప్ తెరిచేటప్పటికి అంతా చెల్లాచెదురుగా ఉంది. డబ్బుల డబ్బా చూస్తే భద్రంగా ఉంది. రూపాయి కూడా తగ్గలేదు. కానీ, తీరా లోపల అంతా సరిగా చూస్తే ఉల్లిపాయల బస్తాలు మిస్సింగ్. ఏకంగా రూ.50 వేల విలువైన సరుకు పోయిందని అతడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లి, అల్లం బాక్సులు కూడా పోయాయని చెప్పాడతను.