శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య శనివారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్లు, ఒక ఆర్మీ జవాన్ చనిపోయారని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. సౌత్ కాశ్మీర్లోని ఝదూరా అనే గ్రామంలో మిలిటెంట్స్ ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని చెప్పారు.
ఆపరేషన్ సమయంలో మిలిటెంట్స్ను లొంగిపోవాల్సిందిగా అవకాశం ఇచ్చామన్నారు. అయితే దీన్ని తిరస్కరించిన మిలిటెంట్స్ భద్రతా దళాలపై కాల్పులకు దిగారన్నారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో ముగ్గురు మిలిటెంట్స్ మృతి చెందారని, వారిని ఆదిల్ హఫీజ్, అర్షిద్ అహ్మద్, రవూఫ్ అహ్మద్ మీర్గా గుర్తించామన్నారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన జవాన్ను ఆస్పత్రికి తరలించామని, చికిత్స జరుగుతున్న టైమ్లో ఆయన చనిపోయాడని వివరించారు.