బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్. ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పెద్దలకు కరోనా లెక్కలపై అవగాహన లేదు అని అంటే ప్రజలు నవ్వుకుంటారని అన్నారు.
కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో దేశం మొత్తం తెలుసని, దేశం పట్ల కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని పల్లెల్లో ఉన్న ప్రజలు కూడా చెప్తారని భాను ప్రసాద్ అన్నారు. మీ ప్రభుత్వం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదన్న ప్రభుత్వ విప్.. మీ సంస్థ ఐసిఎంఆర్ పూటకో మాట చెప్పి రాష్ట్రాలను గందగోళానికి గురిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యం కలవారని, బీజేపీ నాయకులు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మరని అన్నారు. తెలంగాణ ప్రజలు మీకు ఎన్ని ఓట్లు వేశారో తెలియదా? అని ప్రశ్నించారు.
కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేసినా.. విదేశీ విమానాలను కేంద్రం ఆపలేదని, అందులో విఫలం అయిందన్నారు. మార్కజ్ విషయం కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పేవరకు కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియదన్నారు. వలస కూలీల విషయంలో బీజేపీ అవలంబించిన తీరు దేశం అంతా చూసిందని విమర్శించారు
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై , పథకాలపై బీజేపీ నోటికి వచ్చినట్టు మాయమాటలు మాట్లాడితే ఎవరు నమ్మరని హెచ్చరించారు. మీరు ఎప్పుడు అయినా ఒక్క ప్రాజెక్టు కట్టారా…? తెలంగాణ కు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఆ పార్టీ నాయకులని ఉద్దేశించి ప్రశ్నించారు.