హైదరాబాద్,వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతున్నది. ఇరిగేషన్ ఏఈ రమేశ్ హైటెక్ మాల్ ప్రాక్టీస్ కు సహకరించిన మహ్మద్ ఖాలీద్ ను అధికారులు ఈ నెల 9న అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు అనుమతితో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు.
ఖాలీద్ అరెస్టుతో ఈ కేసులో నిందితుల సంఖ్య 52కు చేరింది. ఖాలీద్ మలక్ పేట్ లో నివాసం ఉండేవాడు. రమేశ్ హైటెక్ మాస్ కాపీయింగ్ కాల్ సెంటర్ కోసం మలక్ పేటలో రూమ్ ఏర్పాటు చేశాడు. కాపీయింగ్ కు సహకరించినందుకు ఖాలీద్ కు రమేశ్ రూ.80 వేలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే రమేశ్ కు సహరించిన ఏఈ, డీఏఓ, ఏఈఈ పరీక్షలు రాసిన మరో 40 మందిని గుర్తించి సిట్ అధికారులు విచారిస్తున్నారు.