హైదరాబాద్, వెలుగు: గత రెండు క్వార్టర్లుగా లాభాలలో దూసుకెళ్తున్న యూకో బ్యాంక్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రూ. 1,500 కోట్ల లాభం సంపాదించాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని మొదటి ఆరు నెలల్లో బ్యాంకు రూ. 625 కోట్ల లాభం ఆర్జించింది. హైదరాబాద్లో యూకో బ్యాంక్ నిర్వహించిన ఎక్స్పోర్టర్స్ మీట్లో పాల్గొనడానికి వచ్చిన మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సోమ శంకర ప్రసాద్ ఈ విషయం వెల్లడించారు. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ నుంచి బయటకు రావడంతో 2022–23లో కొత్తగా 200 బ్రాంచీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఇందులో తెలంగాణలో 4, ఆంధ్ర ప్రదేశ్లో ఒకటి ఏర్పాటవుతాయని శంకర్ ప్రసాద్ తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్ తర్వాత అత్యధిక క్యాపిటల్ యాడిక్వసీ రేషియో ఉన్న బ్యాంక్ తమదేనని పేర్కొన్నారు. ఈ ఫైనాన్షియల్ఇయర్లో రూ.1,500 కోట్ల లాభం సంపాదిస్తే, క్యాపిటల్ యాడిక్వసీ రేషియో 15 శాతానికి చేరుతుందని అన్నారు. జూన్, సెప్టెంబర్ క్వార్టర్లలో స్లిపేజెస్ రూ. 500 కోట్లకు మించలేదని, ఇదే సమయంలో ఈ రెండు క్వార్టర్లలోనూ రికవరీలు రూ. 500 కోట్లు దాటాయని శంకర్ ప్రసాద్ వెల్లడించారు. అడ్వాన్సులలో 17 శాతం, డిపాజిట్లలో 10 శాతం గ్రోత్ సాధించినట్లు వివరించారు. గ్రాస్, నెట్ ఎన్పీఏలు బాగా తగ్గాయని చెబుతూ, టైర్1 కింద రూ. 1,000 కోట్ల నిధులను సమీకరించే ప్లాన్లో ఉన్నామని వెల్లడించారు. ఈ ప్రపోజల్కు బోర్డు అనుమతి రావాల్సి ఉందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టీల్, సిమెంట్, రెన్యువబుల్ ఎనర్జీ, ఎన్బీఎఫ్సీలు ఎక్కువగా అప్పుల కోసం వస్తున్నట్లు చెప్పారు. మార్చి 2023 నాటికి రూ. 3.70 లక్షల కోట్ల బిజినెస్ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో...
తెలుగు రాష్ట్రాలలో బ్యాంకు క్రెడిట్ డిపాజిట్ రేషియో 200 శాతంగా ఉందని చెబుతూ, ఇక్కడి నుంచి రూ. 9,500 కోట్ల బిజినెస్ వస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో ప్రస్తుతం 81 బ్రాంచీలు ఉన్నాయని శంకర్ ప్రసాద్ చెప్పారు. బ్యాంకుకు మొత్తం 3,100 బ్రాంచీలున్నాయి. సెప్టెంబర్ క్వార్టర్లో అసాధారణమైన పనితీరుతో 145 శాతం గ్రోత్ కనబరచడంతో యూకో బ్యాంక్ షేరు ధర ఇంచుమించుగా మూడింతలవడం విశేషం. డిజిటైజేషన్పై ఫోకస్ పెడుతున్నామని, ఇదే టైములో సైబర్ సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని శంకర్ ప్రసాద్ చెప్పారు.