న్యూఢిల్లీ : అమెరికా ప్రైవేట్ ఈక్విటీ మేజర్ కేకేఆర్ ఆగస్టు 16న హాస్పిటల్ చైన్ మ్యాక్స్ హెల్త్కేర్లో తన మొత్తం 27 % వాటాను అమ్మనుంది. ఈ లావాదేవీ ద్వారా రూ. 9,000 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. బ్లాక్ డీల్ ద్వారా వాటా అమ్మకం ఉంటుంది. మ్యాక్స్కేర్ హెల్త్కేర్లో పెట్టుబడి పెట్టిన కేకేఆర్-అనుబంధ సంస్థ అయిన కయాక్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఈ డీల్ అమలవుతుంది. ఆగస్టు 15న విడుదల చేసిన డీల్ వివరాల ప్రకారం, మ్యాక్స్ హెల్త్కేర్లోని మొత్తం 26.7 కోట్ల షేర్లను ఒక్కో షేరు ధర రూ. 350-–361.9 వద్ద కేకేఆర్ అమ్ముతుంది. బేస్ ఆఫర్ దాదాపు 20 % వాటా లేదా 19.3 కోట్ల షేర్లకు కాగా, మిగిలిన 6.83 % వాటా లేదా 6.6 కోట్ల షేర్లకు అప్సైజ్ ఆప్షన్. అప్పర్ ఎండ్లో మొత్తం డీల్ విలువను సుమారు రూ.9,416 కోట్లుగా అంచనా వేశారు.
మ్యాక్స్ హెల్త్కేర్లోని షేర్లను 2018లో రేడియంట్తో పాటు కేకేఆర్ ఒక్కొక్కటి రూ.80 చొప్పున కొనుగోలు చేశాయి. పోయిన ఏడాది జూన్ నాటికి, కయాక్ ఇన్వెస్ట్మెంట్స్కు మ్యాక్స్ హెల్త్కేర్లో 45.63 కోట్ల షేర్లు లేదా 47.24 % వాటా ఉంది. 2021 సెప్టెంబర్ 29న కంపెనీ ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 8.44 కోట్ల షేర్లను రూ.2,956 కోట్లకు అమ్మింది. షేర్లను హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, వెరిటాస్ ఫండ్స్ పిఎల్సి ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్లు దక్కించుకున్నాయి. కేకేఆర్-అనుబంధ సంస్థ 2022 మార్చి లో కంపెనీలోని మరో 10 % వాటాను దాదాపు రూ. 3,300 కోట్లకు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, పెన్షన్ ఫండ్ గ్లోబల్ స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్కు అమ్మింది.