మాట నిలబెట్టుకొలేని సీఎం మనకు అవసరమా?

మాట నిలబెట్టుకొలేని సీఎం మనకు అవసరమా?

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు కేసీఆర్ మాయ అని ఆమె అన్నారు. ఉద్యమకారులను కేసీఆర్ అవహేళన చేశారని.. తడిగుడ్డతో వారి గొంతు కోశారన్నారు. హుజురాబాద్‌‌లో బైపోల్స్ ప్రచారంలో పాల్గొన్న ఆమె.. కేసీఆర్‌‌ను గద్దె దించే వరకు వదిలిపెట్టమని తేల్చిచెప్పారు.  అంతేకాదు కేసీఆర్‌‌కు యముడు లాంటి పార్టీ బీజేపీ అన్నారు. కేసీఆర్ ఏం చెప్తే.. కాంగ్రెస్ అది చేస్తుందని.. ప్రజలు ఇంకా మోసపోవద్దన్నారు. 

రాష్ట్రంలో రావణ రాజ్యం పోవాలి... రామ రాజ్యం రావాలన్నారు విజయశాంతి. బీజేపీ నాయకుల కంటే ఎక్కువ ప్రజలే భుజాన వేసుకొని ఈటల రాజేందర్ గెలవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రాజేందర్ అయి పని చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈటల పేరే వినిపిస్తోందన్నారు. మా బిడ్డను మేమే గెలిపించుకుంటామని అంటున్నారని అన్నారు. ఆరు సార్లు గెలిచారంటే ఆయనకు చిత్తశుద్ది ఉందని..  పని చేసే నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. 

ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్న విజయశాంతి.. కేసీఆర్ అబద్ధాలు అన్నీ ప్రజలకు అర్థం అయ్యాయన్నారు. అయన పార్టీకి అవసరం ఉన్నంతవరకు నాయకులను వాడుకొని వదిలివేశారని ఆరోపించారు. ఆనాడు  టైగర్ నరేంద్ర, విజయశాంతి.. ఇప్పుడు ఈటలతో సహా ఉద్యమకారులను బయటకు పంపి.. ఉద్యమ ద్రోహులను తెచ్చుకున్నాడని అన్నారు. ఉద్యమ సమయంలో కుటుంబాన్ని వదిలిపెట్టి ఈటల తిరిగారని చెప్పారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పని చేశారన్నారు. ఉద్యమంలో కేసీఆర్ కానీ, వారి కుటుంబం వారు ఎవరు కూడా  బయటికి రాలేదని, వారి ప్రాణం వారు చూసుకున్నారని విమర్శించారు. 

20 ఏళ్లు పార్టీకోసం పనిచేసిన వాడిని, 7 ఏళ్లు మంత్రిగా పని చేసిన వారిని 7 నిమిషాల్లో తీసివేశారన్నారు విజయశాంతి. తెలంగాణ ఉద్యమ కారులను టీఆర్ఎస్ నడిరోడ్డు మీద నిలబెడితే.. బీజేపీ అక్కున చేర్చుకుందన్నారు. అసలు దోపిడీదారుడు  కేసీఆర్ అని.. సిట్టింగ్ జడ్జతో విచారణ జరపాలని ..తప్పు చేసి ఉంటే ఇప్పటికే శిక్ష వేయాలి అని ఈటల  అడుగుతున్నారు.. ఎందుకు వెయ్యలేదని అని అన్నారు. మాలో చిత్తశుద్ది ఉంది... నువ్వు కాదు మీ తాత కూడా మమ్మల్ని ఏం  చెయ్యలేరని అన్నారు. అంతేకాదు.. కేసీఆర్ నిన్ను గద్దె దించే వరకు వదిలిపెట్టమన్నారు. 

దళిత బంధు బ్యాంక్ ఫ్రీజ్ ఎందుకు చేసావు.. నీకు ఇవ్వడం ఇష్టం లేకనే కాదా అని కేసీఆర్ ను ప్రశ్నించారు విజయశాంతి. GHMC ఎన్నికలో కూడా ఇలానే మోసం చేశాడని.. ఎన్నికల తర్వాత దళిత బంధు ఇవ్వమని టీఆర్ఎస్ నేతల ఇళ్ళముందు ధర్నా చేయండని సూచించారు. కేసీఆర్ కు భయం పట్టుకుంది.. అందుకే ఈ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టడం లేదన్నారు . నంబర్ 1 చెత్త సీఎంగా  కేసీఆర్ అన్ని రంగాల్లో తెలంగాణ పరువు తీశాడని విమర్శించారు విజయశాంతి. మాట నిలబెట్టుకొలేని సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు.