V6 News

మటన్ లాగించేస్తున్న వైజాగ్ వాసులు

మటన్ లాగించేస్తున్న వైజాగ్ వాసులు

తెలుగు రాష్ట్రాల్లో మాంసం ఎక్కువ వినియోగించే ప్రధాన నగరాల్లో విశాఖ ఒకటి. నగరంలో ప్రతీ నెలా సుమారు 100 టన్నులకు పైగా మేక మాంసం వినియోగం జరుగుతోంది. నగర పరిధి విస్తరించని రోజుల్లో నెలకు 50 టన్నుల మాంసం కూడా అమ్ముడు పోయేది కాదు. అయితే గత రెండు దశాబ్దాలుగా నగర జనాభా భారీగా పెరగడంతో.. మాంసం దుకాణాల్లో ప్రతీ వారం సుమారు 2 వేలకు పైగా మేకలను మటన్ గా మార్చేస్తున్నారు.

20 ఏళ్ల క్రితం వరకూ నగరంలో మాంసం వర్తకులకు కావల్సిన జంతువులు ఉత్తరాంధ్రలోనే లభించేవి. ప్రస్తుతం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఖ్య బాగా తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగుమతయ్యే వాటి పైనే ఆధారపడుతున్నారు వ్యాపారులు. దీంతో నగరంలో మటన్ దొరకడం కష్టమైపోయిందంటున్నారు.

డిమాండ్ కు తగిన సరఫరా లేకపోవడంతో.. మాంసం ధర భారీగా పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే వైజాగ్ లో కిలో మాంసం ధర రూ.100  ఎక్కువగానే ఉంటోంది. అయినా కొందామంటే మటన్ అంత ఈజీగా దొరకడం లేదంటున్నారు వినియోగదారులు.

పండగల సీజన్ మొదలు కానుండటంతో రానున్న రోజుల్లో మాంసం వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం పశుసంవర్థక శాఖపై దృష్టి పెట్టి వెంటనే వాటి సంఖ్యని పెంచాలంటున్నారు వ్యాపారులు.