- నలుగురు అరెస్ట్.. పరారీలో మరో ముగ్గురు
- 32 లక్షల విలువైన 80కిలోల సరుకు సీజ్
- గాంధీనగర్లో మరో సప్లయర్ నుంచి 22 కిలోలు స్వాధీనం
హైదరాబాద్/ఎల్ బీ నగర్, ముషీరాబాద్, వెలుగు: వైజాగ్ నుండి సిటీకి గంజాయ్ సప్లయ్ చేస్తున్న ఏడుగురు సభ్యుల గ్యాంగ్ లో నలుగురిని రాచకొండ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గరి నుంచి రూ.32 లక్షల విలువైన 80 కిలోల గంజాయి, 2 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్ బీనగర్ లోని రాచకొండ సీపీ క్యాంప్ ఆఫీసులో శనివారం డీసీపీ సంప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన వద్య ముఖేశ్(25), చౌహాన్ శ్రీనివాస్(23), వద్య మారుతి(26), రాథోడ్ నవీన్(22), వద్య అనిల్(22) ఐదుగురు కలిసి ఈజీ మనీ కోసం గంజాయి సప్లయ్ కి స్కెచ్ వేశారు. వైజాగ్ లోని ఏజెన్సీ ఏరియాకి చెందిన రమేశ్ అలియాస్ ఏలియా, కామేశ్ దగ్గర నుంచి తక్కువ రేటుకి గంజాయిని కొని తీసుకొచ్చి సిటీలో అమ్ముతున్నారు. ఈ నెల 18న ముఖేశ్, శ్రీనివాస్, నవీన్, అనిల్ రెండు కార్లను రెంట్ కి తీసుకుని వైజాగ్ లోని లంబసింగికి వెళ్లారు. అక్కడి 80 కిలోల గంజాయి కొన్నారు. శనివారం సిటీకి వస్తుండగా.. రాచకొండ ఎస్ వోటీ పోలీసులు పెద్దఅంబర్ పేట వద్ద కార్లను అడ్డుకుని నలుగురిని అదపులోకి తీసుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కి తరలించారు. మారుతితో పాటు వీరికి గంజాయి అమ్మిన రమేశ్, కామేశ్ పరారీలో ఉన్నట్లు డీసీపీ సంప్రీత్ సింగ్ తెలిపారు.
గాంధీనగర్ లో..
గంజాయి తరలిస్తున్న వ్యక్తిని గాంధీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ కి చెందిన షేక్ ముదాసీర్(20) వైజాగ్ నుంచి గంజాయిని తీసుకుని సిటీకి వచ్చాడు. శనివారం ముషీరాబాద్ క్రాస్ రోడ్ లో ఉన్న ముదాసీర్ ను గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కి తరలించినట్లు ఇన్ స్పెక్టర్ మోహన్ రావు తెలిపారు.
గంజాయి డోర్ డెలివరీ.. నిందితుడు అరెస్ట్
దూల్పేట్కి చెందిన మహేందర్ సింగ్(35) జుమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఫుడ్ డెలివరీతో కస్టమర్ల ఫోన్ నంబర్ల కలెక్ట్ చేశాడు. ఐటీ ఎంప్లాయీస్ ను టార్గెట్ గా చేసుకున్నాడు. దూల్పేట్లోని డీలర్స్ వద్ద గంజాయి కొని వాటిని ప్యాకింగ్ చేసి ఐటీ ఎంప్లాయీస్ నుంచి ముందస్తు ఆర్డర్స్ తీసుకునేవాడు. స్కూటీపై తిరుగుతూ డోర్ డెలివరీ చేసేవాడు. కాచిగూడకు చెందిన గుజరాతి సోషల్ వెల్ఫేర్ సొసైటీ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ లఖని జితెన్(25), సీతాఫల్మండికి చెందిన డిలైట్ సీనియర్ ఎనలిస్ట్ నుదురుపాటి రమ్య సిద్ధార్త(30), అమెజాన్ డేటా ఇంజనీర్ అనీష్కుమార్(35), సేఫ్ ఎక్స్ప్రెస్ కార్గో సర్విసెస్ సూపర్వైజర్ చిటుకుల సమరసింహారెడ్డి(31)కి మహేందర్ సింగ్ గంజాయి డోర్ డెలివరీ చేశాడు. శుక్రవారం కాచిగూడ వెంకటరమణ థియేటర్ సమీపంలో రాత్రి ఆర్డర్ డెలివరీ చేసేందుకు వచ్చిన మహేందర్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహేందర్ సింగ్ ఇచ్చిన సమాచారంతో అతడి కస్టమర్లు అయిన నలుగురు ఐటీ ఎంప్లాయీస్ను అరెస్ట్ చేశారు.
ఆదిలాబాద్లో గంజాయి సాగు.. సిటీకి ట్రాన్స్ పోర్టు
సికింద్రాబాద్ యాప్రాల్కి చెందిన జవల పాండే(25) స్టాక్ మార్కెట్ ట్రేడర్గా పనిచేస్తున్నాడు. వెస్ట్మారేడ్పల్లికి చెందిన నిఖిల్ షేనయ్(33) డీజే ప్లేయర్గా చేస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ధర్మవరంకి చెందిన సోనే రావు(50), లఖన్(53) గంజాయి సాగు చేస్తున్నారు. అదే జిల్లా మల్లాపూర్కి చెందిన అమర్సింగ్(37), సాబెల్(25), సకరమ్ సాబెల్(25), గోటి హరిసింగ్(50)తో కలిసి సిటీకి గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆదిలాబాద్ ధర్మవరం, వైజాగ్ అరకు నుంచి వచ్చే గంజాయి, హాష్ ఆయిల్ను జవల పాండే, నిఖిల్ కొనేవారు. పుదుచ్చేరిలో ఉంటున్న నైజీరియన్ నికోలస్ ఒలుసొల రొటిమి(33) నుంచి జవల పాండే ఎమ్డీఎమ్ఏ డ్రగ్స్ కొంటున్నాడు. ఇలా ట్రాన్స్పోర్ట్ అయిన గంజాయి,హాష్ ఆయిల్, డ్రగ్స్ను సిటీలోని ఐటీ ఎంప్లాయీస్ కి పాండే సప్లయ్ చేస్తున్నాడు.
సప్లయర్స్గా ఐటీ ఎంప్లాయీస్
అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ అసిస్టెంట్ మేనేజర్ అదిత్య రాజన్(34), కొండాపూర్లో ఉండే స్టూడెంట్ జయబాలాజీని సప్లయర్స్గా మార్చిన పాండే వారికి గంజాయిని అందించేవాడు. రూ.10 వేలకు కిలో గంజాయి కొని రూ.50 వేలకు అమ్మేవాడు. ఆదిత్య రాజన్, జయబాలాజీ గంజాయిని ఆర్డర్స్ ను బట్టి ప్యాక్ చేసేవారు. ఓయో రూమ్ల్లో జరిగే పార్టీలకు సప్లయ్ చేసేవారు. ఇలా బంజారాహిల్స్లోని ప్రైమెర హాస్పిటల్ డాక్టర్ మహ్మద్ మడ్నే(28) కాంటిజెన్స్ ఐటీ కంపెనీ ఫౌండర్ సాయి అనిరుధ్(33), కాగ్నిజెంట్ క్వాలిటీ అనలిస్ట్ కుష్ మిశ్రా(23), బిజినెస్ కన్సల్టెంట్ సిద్ధార్త్ విజయ్ కుమారన్(35) ,సెనెక గ్లోబల్ ఐఐటీ రోహిత్ కుమార్(24), హిందుజా గ్లోబల్ అకౌంటెంట్ బాలాజీ భగవాన్ సింగ్(29)కు వీరు సప్లయ్ చేస్తున్నారు. దీని గురించి సమాచారం అందుకున్న నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ జవల పాండేపై నిఘా పెట్టింది. శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించింది. గంజాయి సాగు చేస్తున్న ఆదిలాబాద్కి చెందిన సోనే రావుతో పాటు నలుగురు ట్రాన్స్పోర్టర్స్ సహా మొత్తం 16 మందిని అరెస్ట్ చేసింది. 10 గ్రాముల డ్రగ్స్,100 గ్రాముల హాష్ ఆయిల్,8 కిలోల గంజాయి,కారు, 3 బైక్లను స్వాధీనం చేసుకుంది.