న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిన్మయానందపై రేప్ కేసు ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. లా స్టూడెంట్పై అత్యాచారం చేసిన వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అధికార యంత్రాంగం చిన్మయానంద సేవలో పాల్గొంటారని ఆమె ఆరోపించారు. ఏడాది క్రితం చిన్మయానంద నిర్వహించిన హారతి కార్యక్రమంలో అధికారులంతా పాల్గొన్నారని, దానిని మీడియా కూడా ప్రశ్నించిందంటూ న్యూస్పేపర్ క్లిప్పింగ్స్ను ట్వీట్ చేశారు. తనపై జరిగిన దారుణకాండను బాధితురాలు వివరంగా చెప్పినా చిన్మయానందపై రేప్ కేసు పెట్టడానికి అధికారులు వెనుకాడడంపై ప్రియాంక మండిపడ్డారు. చిన్మయానంద తనపై అత్యాచారం చేశాడని లా స్టూడెంట్ కేసు పెట్టడంతో సిట్ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. చిన్మయానందను డబ్బులకోసం బెదిరించిందన్న కేసులో బాధితురాలిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.