హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉద్యోగాలు అమ్ముకుంటోందని, టీఎస్పీఎస్సీ రద్దుకు రాష్ట్రపతికి లెటర్ రాస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఉదయం కేయూలోని స్టూడెంట్స్తో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భట్టి మాట్లాడుతూ కేసీఆర్ పాలన కొనసాగితే వర్సిటీ భూములు కూడా అమ్మేస్తాడన్నారు. పీపుల్స్ మార్చ్ లో భాగంగా యూనివర్సిటీ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు ఇచ్చింది లేదన్నారు. కనీసం దేవాదుల ఫేజ్-2 పనులు సక్రమంగా చేయించినా ఫలితముండేదన్నారు. కృష్ణా నదిపై పాలమూరు- రంగారెడ్డి పంపింగ్ స్టార్ట్ కాలేదన్నారు. వరంగల్లో కుర్చీ వేసుకుని అండర్గ్రౌండ్ డ్రైనేజీ కట్టిస్తానని చెప్పారని, ఇంతవరకు దాని ఊసేలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూంలు, జర్నలిస్టులకు ఇండ్లు కూడా రాలేదన్నారు. కేంద్ర హోం మంత్రి రాష్ట్రానికి వచ్చి మైనార్టీ రిజర్వేషన్లపై మాట్లాడితే..ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇంతవరకు నోరుమెదపలేదన్నారు. ఎంఐఎం కూడా ఎందుకు మాట్లాడటం లేదో తెలియడం లేదన్నారు.
విభజన హామీల్లో భాగంగా కాజీపేటకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీ అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలో బీసీ జనగణన చేపట్టకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బి. శోభారాణి, హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డి నేటర్ నమిండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.