కేపీహెచ్బీ పీఎస్ ముందు బీజేపీ నేతల ఆందోళన

కేపీహెచ్బీ పీఎస్ ముందు బీజేపీ నేతల ఆందోళన

హైదరాబాద్లో కేపీహెచ్ బీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీఆర్ఎస్ కోర్డినేటర్ సతీష్ అరోరాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.... కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. మేడ్చల్ మల్కాజ్ గిరి అర్భన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, ఇతర నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్టేషన్ కు ముందు ధర్నాకు దిగిన నేతలను అడ్డుకున్నారు పోలీసులు. సతీష్ అరోరాను అరెస్ట్ చేసి చర్యలు తీసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బీజేపీ నేతలు అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు బలవంతంగా వారిని పంపించేందుకు యత్నించారు. పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బీజేపీ నేతలను చొక్కాలను పట్టి లాగడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు చేయి చేసుకున్నారని మండిపడ్డారు.