అద్వానీని కాదని మోదీని ఎంచుకోవడం బాధించింది.. కానీ తప్పలేదు: వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

అద్వానీని కాదని మోదీని ఎంచుకోవడం బాధించింది.. కానీ తప్పలేదు: వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు

2014 ఎన్నికల వేళ ఆనాడు ఎల్. కే. అద్వానీ  నాయకత్వం కాదని, మోదీ  నాయకత్వంతో ముందుకు సాగడం వల్లే దేశంలో మూడు సార్లు అధికారంలోకి రాగలిగామన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.  తన జీవిత ప్రస్థానం గురించి రాసిన వెంకయ్య నాయకుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు ... 

వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. నా  జీవితంలో నేను పోయిన తర్వాత మాట్లాడాల్సిన మాటలను కూడా నా మిత్రులు ఇప్పుడే మాట్లాడారు. నా జీవితంలో జరిగిన వాస్తవ విషయాలను ప్రస్తావించారు.నా సేవలు సమాజానికి తెలియాలంటే ఒక పుస్తకం రాయాలని మిత్రులందరూ పట్టుబట్టారు. ఇందులో అన్ని విషయాలను, నిజాలను మాత్రమే చక్కగా రాసిన మాశర్మకి నా అభినందనలు.

చిన్నతనంలో పార్టీ సిద్ధాంతాల గురించి గోడల మీద రాసే అలవాటు ఉండేది. అలా గోడలపై రాసిన నేను, తర్వాతి కాలంలో ఒక అధికార పార్టీకి జాతీయ అధ్యక్షుడిని కావడం నా జీవితంలో ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
సమాజంలో ప్రజల కోసం నిజాయితీగా సేవ చేసే నాయకులను ప్రజలు ఎప్పటికీ వదులుకోరు అనడానికి నా ఉదయగిరి గెలుపే సజీవ నిదర్శనం.

►ALSO READ | రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ.. ఎందుకంటే..?

2014 ఎన్నికల సమయంలో ఆనాడు ఎల్. కే. అద్వానీ  నాయకత్వం కాదని, మోదీ  నాయకత్వంతో ముందుకు సాగడం వల్లే దేశంలో మూడు సార్లు అధికారంలోకి రాగలిగాం. మహానాయకుడు అద్వానీకి కొడుకు లాంటి నేను మోదీని ఎంపిక చేయాల్సి రావడం కొంత బాధనిపించినా.. రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆ నిర్ణయం తప్పలేదు. అయోధ్య కరసేవకు వెళ్లి వస్తున్న సమయంలో రైలు ప్రమాదంలో (గోధ్రా ఘటన) 56 మంది కార్యకర్తలు చనిపోయారు. ఆ కఠిన సమయంలో తీసుకున్న అంతర్గత నిర్ణయాలు, సిద్ధాంతపరమైన అంశాలు ఎంతో తృప్తినిచ్చాయి.

ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలను పక్కనబెట్టి పార్టీ పిరాయింపులకు పాల్పడుతున్నారు.అలాంటి వారిపై 10వ షెడ్యూల్ (Anti-Defection Law) లో మార్పులు తీసుకురావాలి. పిరాయింపుదారులపై ఫిర్యాదు చేసిన 3 నెలల లోపే కఠిన చర్యలు తీసుకునేలా చట్టం ఉండాలి.రాజకీయ నాయకులు ఎల్లప్పుడూ సంస్కారవంతమైన భాషను వాడుతూ ప్రజలకు సేవ చేయాలి. రాష్ట్ర అసెంబ్లీలో జుగుప్సాకరంగా బూతులు మాట్లాడే ఒక్క నాయకుడు కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపొందలేదు.

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 1వ తేదీన జీతాలు ఇవ్వలేమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రంపై ఆధారపడే ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు ఉచితాలు ఇవ్వడంపై పునరాలోచించాలి.ప్రజలను అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలి తప్ప, ఉచితంగా సంక్షేమం ఇవ్వకూడదు. అయితే.. సమాజంలో ప్రభుత్వాలు చదువు, వైద్యం మాత్రం పేదలకు ఖచ్చితంగా ఉచితంగా అందించాలి.

నేను రాజకీయాల్లో ఇంతటి వాడినవడానికి ఆర్.ఎస్.ఎస్ (RSS), ఏబీవీపీ (ABVP), బీజేపీ (BJP) పార్టీలు నా మిత్రులు అండగా నిలిచారు. అందుకే నా మిత్రులకు నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.
చిన్నతనంలోనే అమ్మను కోల్పోయాను. కానీ అమ్మ కోరిక మేరకు లా (Law) పూర్తి చేశాను. అమ్మ తర్వాత నన్ను అమ్మమ్మ పెంచింది. మా అత్తమ్మ నన్ను కన్నతల్లిలా చూసుకుంది. నా భార్య ఉషను కూడా నేను అమ్మలాగే భావిస్తాను, అందుకే ఆమెను ఉషమ్మ అని పిలుచుకుంటాను.

దేశంలో ఆర్టికల్ 370 రద్దు అనేది నా చిన్ననాటి నినాదం. నేను రాజ్యసభ చైర్మన్‌గా ఉంటేనే సభను సమర్థవంతంగా నడిపించి ఈ బిల్లును ఆమోదింపజేయగలనని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తంచేశారు.ఆ నమ్మకంతోనే మొదట రాజ్యసభలో బిల్లు పెట్టి, ఆ తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో సభ్యులందరికీ తగినంత సమయం ఇచ్చి, సుదీర్ఘ చర్చల తర్వాతే ఆర్టికల్ 370 రద్దును చారిత్రాత్మకంగా ఆమోదించాం.