బండి సంజయ్ పాదయాత్ర లో సెల్ఫీలకే పరిమితం

బండి సంజయ్ పాదయాత్ర లో సెల్ఫీలకే పరిమితం

బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశ్యం ఏంటో...బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కేసీఆర్ ఢిల్లీకి పోవడానికే మీ పాదయాత్ర ఉపయోగపడుతోందన్నారు. వేములవాడలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన..సీఎం కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటున్న మాట మిలియన్ జోక్ గా మారిందన్నారు. ఢిల్లీలో దోస్తు, గల్లీలో లొల్లి అర్థం ఏంటి..అని ప్రశ్నించారు. అంతేకాదు బండి సంజయ్ పాదయాత్ర లో సెల్ఫీలకే పరిమితం అయిందని విమర్శించారు. దేవాలయల అభివద్ధికి, పార్లమెంట్ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏం చేశావు.. ఎన్ని మీటింగ్ లకు అటెండ్ అయ్యావో చెప్పాలని బండిని ప్రశ్నించారు. 

ఎన్నికయి రెండు ఏళ్ళు గడిచింది.. ఇప్పటివరకు ఏం అభివృద్ధి చేశావో చెప్పాలన్నారు పొన్నం ప్రభాకర్. మీ పాదయాత్రతో ఏమైనా మెడికల్ కాలేజీలు,నవోదయ పాఠశాలలు వచ్చాయా అని అన్నారు. కేంద్రం నుంచి మీరు ఇప్పటివరకు కరీంనగర్ నియోజకవర్గానికి  ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. పత్రికల వార్తలకు తప్ప మీ మాటలు దేనికి ఉపయోగ పడవన్నారు. కేసీఆర్ ను జైళ్లో పెట్టిస్తా అని అంటున్నావు... కానీ మీ కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. 

కరోనా, వరదలు, ప్రజల సమస్యల పై బండి సంజయ్ మాట్లాడటం లేదని.. ఆయన కేసీఆర్ తొత్తు కాకపోతే మీ కేంద్రం నుండి సీఎం పై ఎంక్వయిరీ చేయించాని..ఇవాళ్టి ప్రజా సంగ్రమ యాత్రలో మాట్లాడాలని బండి సంజయ్ ని డిమాండ్ చేశారు పొన్నం.