- భర్త మృతి, గాయాలతో బయటపడ్డ భార్య
న్యూఢిల్లీ: ఓ కొత్త జంటను ఢిల్లీ వీధుల్లో వెంటాడి మరీ కాల్పులు జరిపారు. ఘటనలో భర్త వినయ్ధాహియా(23) చనిపోగా, భార్య కిరణ్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతోంది.గురువారం రాత్రి 9.30 ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. హర్యానాలోని గోపాల్పూర్లో ఒకే కులానికి చెందిన వినయ్, కిరణ్లు స్కూల్ రోజుల నుంచే ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో కిందటేడాది ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఢిల్లీకి వచ్చి బతుకుతున్నారు. అయినా వారిని సొంత వాళ్లు విడిచిపెట్టలేదు. వెతికి మరీ కాల్చేసిన్రు. కొడుకు మరణ వార్త విన్న వినయ్ తండ్రి వాళ్లను ఇంటికి రావద్దని చెప్పానే కానీ వాళ్ల చావు కోరలేదని తెలిపాడు. అయితే సొంత వాళ్లే ఈ హత్య చేసినట్లుగా కిరణ్ వాంగ్మూలం ఇచ్చిందని, తన అన్నలే (విక్కీ, అమన్) వాళ్లను కాల్చారని పోలీసులు చెప్పారు. ఈ జంట కిందటేడాది ఆగస్టు 13న పెండ్లి చేసుకున్నారు. పెళ్లయిన నాటి నుంచీ ఇరు కుటుంబాలతో కమ్యూనికేషన్ లేదు. అయితే, తమ కుటుంబ సభ్యుల నుంచి ముప్పు ఉందని వినయ్, కిరణ్లో పోయినేడే హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. వీరి భద్రత కోసం కోర్టు నుంచి సోనిపట్ పోలీసులకు ఆదేశాలు కూడా అందాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు.