ప్రపంచంలోనే ఎక్కువ జనం ఉన్న దేశం చైనా. దాని తర్వాతి స్థానం ఇండియాదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులేషన్లో ఒక్క ఆసియాలోనే 40 శాతం ఉంది ఉన్నారు. వీరిలో ఎన్నో జాతులు.. ఇంకెన్నో వర్గాలు, మరెన్నో మతాలు ఉన్నాయి. అయితే వీటన్నింటికీ మూలమైన దాదాపు 10 రకాల వంశాలు (ఆన్సెంట్రల్ లీనేజెస్) ఆసియా ప్రజల పూర్వీకుల్లో ఉండేవట. సింగపూర్లోని నన్యాంగ్ టెక్నోలాజికల్ యూనివర్సిటీ (ఎన్టీయూ)కి చెందిన ‘జీనోమ్ ఆసియా100కే కన్సార్షియం’ రీసెర్చర్లు చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఆసియన్లకు వచ్చే వ్యాధులపై స్టడీ చేయడంలో, మెడిసిన్లు అందించే విషయంలో ఈ స్టడీ ఎంతో ఉపయోగపడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
64 దేశాల్లో స్టడీ
ఆసియాలో నివసిస్తున్న ప్రజల1,00,000 జీనోమ్స్ సీక్వెన్సింగ్ చేయడం ద్వారా ఇక్కడి జాతుల మధ్య జన్యుపరమైన వైవిధ్యాన్ని బాగా అర్థం చేసుకునేందుకు2016లో జీనోమ్ ఆసియా ఏర్పడింది. దాదాపు 64 దేశాల్లో స్టడీ చేసి.. 1,739 మంది జీనోమ్స్ను సైంటిస్టుల బృందం అనలైజ్ చేసింది. ఆసియాలో కనీసం10 వేర్వేరు పూర్వీకుల సమూహాలు లేదా వంశాలు ఉన్నాయని, నార్త్ యూరప్లో మాత్రం ఒకే ఒక్క వంశం ఉందని పేర్కొంది. ఒక్క ఇండియాలోనే 598 జీనోమ్స్ ను సీక్వెన్స్చేసినట్లు వివరించింది. ప్రపంచ జనాభాలో 40 శాతం ఆసియాలోనే ఉన్నా.. గతంలో నమోదైన జీనోమ్ సీక్వెన్సెస్ లో మాత్రం 6 వంశాలే గుర్తించారు. ‘‘యూరోపియన్ దేశాల ప్రజలందరినీ పరిశీలిస్తే.. జెనెటికల్ స్థాయిని బట్టి, వారందరిదీ ఒకే పూర్వీకుల వంశంగా పరిగణించవచ్చు. అలాగే ఆసియా వంశాల ప్రజలందరి జెనెటికల్ డిఫరెన్సెస్ ని పరిశీలిస్తే.. పది రకాల గ్రూపులు లేదా వంశాలు ఉన్నట్లు తెలుస్తోంది” అని ఎన్టీయూ ప్రొఫెసర్, స్టడీ కో-లీడర్ స్టీఫన్ సి. షుస్టర్ చెప్పారు.
ఎక్కడెక్కడ ఎన్నెన్ని జీనోమ్స్?
రక్తం, లాలాజల శాంపిల్స్నుంచి సేకరించిన జినోమిక్ డీఎన్ఏను అమెరికా, ఇండియా, దక్షిణ కొరియా, సింగపూర్లోని నలుగురు కన్సార్షియం సభ్యుల లాబోరేటరీలలో సీక్వెన్స్ చేశారు. ఈ స్టడీలో భాగంగా ఇండియాలో 598 జీనోమ్స్ను సీక్వెన్స్ చేశారు. మలేసియాలో 156, సౌత్ కొరియాలో 152, పాకిస్తాన్లో 113, మంగోలియాలో 100, చైనాలో 70, పపువా న్యూ గునియాలో 70, ఇండోనేసియాలో 68, ఫిలిప్పీన్స్లో 52, జపాన్లో 35, రష్యాలో 32 జీనోమ్స్ను సీక్వెన్స్చేశారు. ఈ స్టడీ పూర్తి వివరాలు నేచర్ జర్నల్లో పబ్లిష్ అయ్యాయి.