టెన్త్ స్టూడెంట్లందరూ పరీక్షలకు వారం ముందే హాస్టళ్లకు..
అందరికీ థర్మల్ స్క్రీనింగ్, అబ్జర్వేషన్: సత్యవతి రాథోడ్
హైదరాబాద్, వెలుగు: టెన్త్ పరీక్షలకు వారం రోజుల ముందే స్టూడెంట్లు హాస్టళ్లకు చేరుకునేలా చూడాలని, ప్రతి స్టూడెంట్కూ థర్మల్ స్క్రీనింగ్ చేసి అబ్జర్వేషన్లో పెట్టాలని అధికారులను గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఇమ్యూనిటీని పెంచే ఫుడ్డును స్టూడెంట్లకు ఇవ్వాలని చెప్పారు. ప్రతి స్టూడెంట్కు రెండు మాస్కులు, ఒక శానిటైజర్ ఇవ్వాలన్నారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలన్నారు. టెన్త్ పరీక్షల నిర్వహణ, -కరోనా కట్టడి చర్యలపై ఆమె శనివారం ఎస్సీ, ఎస్టీ గురుకుల స్కూళ్ల సెక్రటరీ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తులతో రివ్యూ చేశారు.
స్టూడెంట్లకు వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ టెన్త్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. గిరిజన శాఖ ఆధ్వర్యంలోని స్కూళ్లలో 2,949 మంది స్టూడెంట్లున్నారని, అన్ని జిల్లాల్లో వాళ్ల కోసం 38 సెంటర్లను ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. పరీక్షా కేంద్రాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో టీచర్లు, సిబ్బంది దగ్గరుండి తీసుకెళ్లాలని చెప్పారు. హాస్టళ్లు, పరీక్షా కేంద్రాల్లో మాస్కులు, శానిటైజర్లు లేకుండా ఎవరినీ అనుమతించొద్దన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పినాకి హెల్త్ కమాండ్ సెంటర్ సేవలను వాడుకోవాలని అధికారులకు మంత్రి చెప్పారు.