ఖైదీలనూ వదలని కరోనా.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 265 మందికి పాజిటివ్‌

ఖైదీలనూ వదలని కరోనా.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 265 మందికి పాజిటివ్‌

జైలులో ఉన్న ఖైదీలనూ కరోనా మహమ్మారి వదలడం లేదు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు పరీక్షలు చేయించారు జైలు అధికారులు. ఈ పరీక్షల్లో 247 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల ఒకటో తేదీన 75 మందికి పరీక్షలు చేయగా జైలులో విధులు నిర్వహిస్తున్న 24 మంది సిబ్బందికి, 9 మంది ఖైదీలకు, 2వ తేదీన 64 మందికి పరీక్షలు చేయగా 9 మంది ఖైదీలకు కరోనా సోకినట్లు తేలింది. సెంట్రల్‌ జైలులో మొత్తం 1,675 మంది ఖైదీలు ఉండగా వారిలో 265 మంది కరోనా బారినపడ్డారు. జైలు సిబ్బందిలో 24 మందికి పాజిటివ్ రాగా, వారందరినీ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఒకటి, రెండో తేదీల్లో చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన 18 మంది ఖైదీలకు జీఎస్‌ఎల్‌ ఆస్పత్రిలో చికిత్సకు పంపారు. అయితే  వీరిలో ఒక ఖైదీ ఆస్పత్రి నుంచి పరార్ కావడంతో మొత్తం ఖైదీలను ఆస్పత్రి యాజమాన్యం డిశ్చార్జ్‌ చేసింది. అందులో 8 మంది బెయిల్‌పై విడుదల కాగా, వారు హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలని అధికారులు సూచించారు. మిగిలిన 10 మంది ఖైదీలను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ఉంచి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. ఈ నెల 3వ తేదీన చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 247 మంది ఖైదీలను బయటి ఆస్పత్రికి తరలిస్తే సెక్యూరిటీ సమస్య రావచ్చని అన్నారు జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు. భారీ సంఖ్యలో బెడ్లు కూడా ఏర్పాటు చేయవలసి ఉండడంతో ఖైదీలను సెంట్రల్‌ జైలులోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.