75 శాతం మంది జేఈఈ పరీక్షలు రాయలేకపోయారు: మమతాబెనర్జీ

75 శాతం మంది జేఈఈ పరీక్షలు రాయలేకపోయారు: మమతాబెనర్జీ

కరోనా కారణంగా నిన్న(మంగళవారం, సెప్టెంబర్-1) జరిగిన JEE మెయిన్ పరీక్షలను పశ్చిమబెంగాల్ లోని 75 శాతం మంది విద్యార్థులు రాయలేకపోయారని ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,652 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా… కేవలం 1,167 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. కరోనా కారణంగా విద్యార్థులు అవకాశాన్ని కోల్పోయారని అన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షను నిర్వహించడం దారుణమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే అధికారం కేంద్రానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరారు.

అన్ లాక్-4 తో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లోకల్ లాక్ డౌన్ ను విధించకూడదనే కేంద్ర హోంశాఖ ఉత్తర్వులపై కూడా మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పరిధిలో లాక్ డౌన్ విధించే అధికారం రాష్ట్రాలకు లేకుండా చేయడం ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం నమ్మాలని చెప్పారు. కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసినంత మాత్రాన సరిపోదని… వాటిని అమలు చేయాల్సింది రాష్ట్రాలేనన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందో జిల్లా యంత్రాంగానికే తెలుస్తుందన్నారు. ఫెడరలిజంకు ఇదే కీలకమని చెప్పారు. కోల్ కతా మెట్రో రైలు సేవలను ప్రారంభించే అంశంపై ఈ నెల 15వ తేదీ లోపల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మమతాబెనర్జీ.