చిత్తూరు జిల్లా: కుటుంబసభ్యులతో కలసి దైవ దర్శనానికి వెళ్లి, అనంతరం అక్కడి కొండపై నుంచి దూకి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా, మదనపల్లె మండలం, వేంపల్లి పంచాయితీ లోని మల్లయ్య కొండ వద్ద ఈ ఘటన జరిగింది. మృతురాలు వేంపల్లి పంచాయతీ లోని గుట్ట కింద పల్లెకు చెందిన సుజనకుమారి (24)గా పోలీసులు గుర్తించారు.
మదనపల్లె బాలాజీ నగర్ కు చెందిన విశ్వనాథ్ , సుజన కుమారి దంపతులు బెంగళూరులోని ఓ ఐటి కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో బెంగుళూరు నుంచి వచ్చి మదనపల్లి లోనే ఉంటున్నారు. శనివారం కుటుంబ సభ్యులతో కలసి మల్లయ్య కొండ స్వామి దర్శనం చేసుకున్న సుజన కుమారి…కుటుంబ సభ్యులు స్వామివారి సన్నిధిలో నుండగా కొండపైనుండి క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.