న్యూఢిల్లీ: అబుదాబి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముబాదలా అనే కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)లో భారీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చింది. జియో ప్లాట్ఫామ్స్లో రూ.9,093.60 కోట్లను ముబాదలా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆర్ఐఎల్ తెలిపింది. గత ఆరు వారాల్లో ఆర్ఐఎల్లో పెట్టుబడిన పెట్టిన ఆరో కంపెనీగా ముబాదలా నిలవనుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కింద ఆర్ఐఎల్ రూ.87,655.35 కోట్ల నిధులను సమకూర్చుకుంది. దీంతో వచ్చే ఏడాది మార్చి వరకు నికర రుణ రహిత కంపెనీగా మారే దిశగా ఆర్ఐఎల్ మరో ముందడుగు వేసింది. తాజా డీల్తో జియో ప్లాట్ఫామ్స్లో 1.58 శాతం ఈక్విటీ స్టేక్ను ముబాదలా సొంతం చేసుకోనుంది.
‘ముబాదలా జియో ప్లాట్ఫామ్స్లో రూ.9,093.60 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 4.91 లక్షల కోట్ల విలువైన ఈక్విటీని కొనుగోలు చేయనుంది. దీని ఎంటర్ప్రైజ్ వ్యాల్యూ రూ. 5.16 లక్షల కోట్లు. ముబాదలా ఇన్వెస్ట్మెంట్ 1.85 శాతం ఈక్విటీ షేర్స్ స్టాక్ రూపంలో దక్కించుకోనుంది’ అని ఆర్ఐఎల్ ఓ ప్రెస్ నోట్లో పేర్కొంది. ఇండియాను డిజిటల్ గ్రోత్ వైపు నడిపించే మా ప్రయాణంలో గ్లోబల్ గ్రోత్ ఇన్వెస్టర్స్లో ఒకటైన ముబాదలా లాంటి కంపెనీ జట్టు కట్టనుండటం హ్యాపీగా ఉందని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు.