ధరణి స్థానంలో పటిష్ట భూపోర్టల్​ తేవాలి : ఆకునూరి మురళి

ధరణి స్థానంలో పటిష్ట భూపోర్టల్​ తేవాలి : ఆకునూరి మురళి
  • సోమాజిగూడలో ‘ధరణిలో మార్పు రావాలి – భూమాత ఎలా ఉండాలి’ వర్క్​షాప్​

ఖైరతాబాద్, వెలుగు: ధరణిలో అనేక మార్పులు  చేస్తూ  పటిష్టమైన భూమాత  పోర్టల్​ను తీసుకు రావాలని నూతన ప్రభుత్వాన్ని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కోరారు. వాయిస్​ఆఫ్​తెలంగాణ,​ సాదిక్ పౌండేషన్​ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్​లోని వాసవిక్లబ్​ఆడిటోరియంలో ‘ధరణిలో మార్పు రావాలి– భూమాత ఎలాఉండాలి’ అనే అంశంపై వర్క్​షాప్​నిర్వహించారు. సదస్సుకు హాజరైన ఆకునూరి మురళి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిపుణులతో  సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్​లక్షలాది మంది  రైతుల భూములను కొల్లగొట్టిందని, అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు.

భూమిని సమగ్రంగా కొలిచి, రైతుల ఆధీనంలో ఉన్న  భూమి హద్దులను, అక్షాంశ  రేఖాంశాలు నిర్ణయించి పటాలను తయారు చేయడం, వాటిని గ్రామ సభలో గ్రామస్తులు ముందు ఆమోదింపజేయడం వంటి కార్యక్రమాలను చేయాలన్నారు. గ్రామ ప్రజలు తమ భూమి సమస్యలను వారి గ్రామంలోనే పరిష్కరించుకునే విధంగా గ్రామ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

భూమాత కోసం ఎదురుచూస్తున్నరు: సాదిక్​ అలీ

సమన్వయ కర్త సాదిక్ ఫౌండేషన్​ఛైర్మన్​సాదిక్​అలీ మాట్లాడుతూ.. గత మే నెలలో 31 జిల్లాల్లో ఎంపిక చేసుకున్న గ్రామాల్లో పర్యటించి వేలాది మంది రైతులతో చర్చించామన్నారు. రాష్ట్ర ప్రజలంతా నూతన భూమాత పోర్టల్​కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కిసాన్​కాంగ్రెస్​జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మాట్లాడుతూ.. నూతన ప్రభుత్వం ధరణి స్థానంలో భూమాతను తీసుకొస్తుందని, అందరిని సంప్రదించి, మళ్లీ తప్పులు జరగకుండా  తెస్తామని, సీఎం రేవంత్​రెడ్డి ఈ సమస్యకు  అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.

సీనియర్ జర్నలిస్ట్​పాశం యాదగిరి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నియంతృత్వ వైఖరితో ఏకపక్షంగా ధరణిని తీసుకువచ్చి కోట్టాది రూపాయిలు కొల్లగొట్టిందన్నారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని అవసరమైతే జైలుకు పంపాలన్నారు. ఈ సమావేశంలో కరుణాకర్​దేశాయ్,​వేణుగోపాల్, పాశం విద్య, న్యాయవాదులు మల్లికార్టున, సంజీవ్, అన్వర్​ పటేల్​ తదితరులు మాట్లాడారు