కేరళ గవర్నర్గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఇవాళ(శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్,మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం స్థానంలో ఆరిఫ్ బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ సదాశివం పదవీకాలం పూర్తవడంతో.. ఆయన స్థానంలో ఖాన్ ను కేంద్రం నియమించింది.
26వ ఏట ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్లో చేరారు. 1980, 84 లో లోక్సభకు ఎన్నికయ్యారు. షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును అప్పటి రాజీవ్గాంధీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర క్యాబినెట్ నుంచి వైదొలిగిన ఖాన్.. కాంగ్రెస్ను వీడిన తర్వాత జనతాదళ్, బీఎస్పీలో చేరారు. 2004లో బీజేపీ లో చేరారు.