- పీఎఫ్ఐపై మళ్లీ దాడులు..243 మంది అరెస్టు
- పలు డాక్యుమెంట్లు, ఆధారాలు స్వాధీనం
- అత్యధికంగా కర్నాటకలో 75 మంది అదుపులోకి
- ఈ నెల 22న జరిగిన రెయిడ్స్లో 106 మంది అరెస్టు
న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నేతల ఆఫీసులు, ఇండ్లపై ఎన్ఐఏ మరోసారి రెయిడ్స్ చేసింది. ఆపరేషన్ ఆక్టోపస్లో భాగంగా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో సోదాలు చేసింది. ఉగ్ర కార్యకాలాపాలకు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలతో ఏడు రాష్ట్రాలకు చెందిన 243 మందిని అరెస్టు చేసింది. పలు డాక్యుమెంట్లు, ఆధారాలను స్వాధీనం చేసుకుంది. పీఎఫ్ఐకి సంబంధించిన19 కేసులపై ఎన్ఐఏ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలో ఈ నెల 22న ఎన్ఐఏ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు, యూటీల్లో చేపట్టిన మల్టీ ఏజెన్సీ రెయిడ్స్లో 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలు, లీడర్లను అరెస్టు చేశారు.
సోమవారం అర్ధరాత్రి దాటాక..
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేశవ్యాప్తంగా ఆపరేషన్ మొదలు పెట్టారు. ఉదయం దాకా సోదాలు కొనసాగాయి. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్నాటక, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్లో ఎన్ఐఏ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల పోలీసులు రెయిడ్స్ చేపట్టారు. అస్సాంలో 25 మంది, మహారాష్ట్రలో 25 మంది, ఉత్తరప్రదేశ్లో 57 మంది, ఢిల్లీలో 30 మంది, మధ్యప్రదేశ్లో 21 మంది, గుజరాత్లో 10 మందిని అరెస్టు చేశారు. కర్నాటకలో అత్యధికంగా 75 మందిని అదుపులోకి తీసుకున్నారు.
యూపీలోని 26 జిల్లాల్లో యాంటీ
టెర్రరిజం స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా సోదాలు చేశారు. పలు డాక్యుమెంట్లు, ఆధారాలనుసేకరించారు. అస్సాంలోని గోల్పారాలో 10 మంది, కామ్రూప్లో ఐదుగురు, ధుబ్రిలో ముగ్గురిని.. బార్పేట, బస్కా, దర్రంగ్, కరీమ్గంజ్లో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్, షహీన్ బాగ్, జామియా నగర్ సహా పలు ఏరియాల్లో ఢిల్లీ పోలీస్ స్పెషట్ సెల్ సోదాలు చేసింది. పారామిలిటరీ దళాలను ఆయా ప్రాంతాల్లో భద్రత కోసం మోహరించారు. జామియా నగర్లో నవంబర్ 17 దాకా 144 సెక్షన్ విధించారు.కర్నాటకలో 75 మందిని అరెస్టు చేశారు. బాదర్, మంగళూరు, కోలార్, విజయ్పురా, బాగల్కోట్, చిత్రదుర్గ, బళ్లారి, చామరాజ్నగర్లో రెయిడ్స్ చేశారు. మహారాష్ట్రలోని పుణెలో ఆరుగురిని, ముంబ్రాలో ఇద్దరిని, భీవండి, కల్యాణ్లో ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకున్నారు.
హర్తాల్ హింస.. కేరళలో నలుగురి అరెస్టు
ఆరు రోజుల కిందట జరిగిన సోదాలపై తీవ్రంగా స్పందించిన పీఎఫ్ఐ.. మంగళవారం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పీఎఫ్ఐపై బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈనెల 23న పీఎఫ్ఐ చేపట్టిన హర్తాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన నలుగురిని కేరళలో అరెస్టు చేశారు. కొట్టాయంలో ముగ్గురు, కొల్లాంలో ఒకరిని అదుపులో తీసుకున్నారు.