
హైదరాబాద్, వెలుగు : తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదని, ధిక్కార స్వరాలని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మం– వరంగల్– నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించాలని శనివారం ఆయన ట్విట్టర్లో కోరారు. రాకేశ్రెడ్డి హనుమకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారని, అమెరికాలో ఏడేండ్లు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేశారని తెలిపారు.
అద్భుతమైన వాగ్దాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం రాకేశ్ రెడ్డికి ఉందని చెప్పారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే పేద విద్యార్థుల కోసం రాకేశ్ రెడ్డి ఈ–-క్లాసెస్ యాప్ ద్వారా ఫ్రీ కోచింగ్ అందజేశారని గుర్తుచేశారు. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఖమ్మం– వరంగల్– నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాకేశ్ రెడ్డి సరైన చాయిస్ అని పేర్కొన్నారు. ‘‘యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న రాకేశ్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారు. నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొదటి ప్రాధాన్యత ఓటు రాకేశ్ రెడ్డికి వేసి.. గెలిపించాలని కోరుతున్నాం’’అని కేటీఆర్ ట్విట్టర్లో కోరారు.