మహేశ్వరం మండలం తుక్కుగూడలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో హోంగార్డ్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఎంతో భవిష్యతు ఉన్న హోంగార్డు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగటంతో హాస్పిటల్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం (మార్చి 01) తుక్కుగూడ ప్రాంతంలో శ్రీ విశిష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హోంగార్డ్ సంతోష్ మరణించాడు. గుండె నొప్పితో ఆసుపత్రికి వచ్చిన సంతోష్ సమయానికి తగిన చికిత్స అందకపోవడంతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గుండె నొప్పితో హాస్పిటల్ కి వచ్చిన సంతోష్ కు మొదట నర్సులు, సిబ్బంది ద్వారా చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ అతన్ని అత్యవసర పరిస్థితుల్లో వేరే హాస్పటల్ కు రెఫర్ చేశారు. మార్గమధ్యలోనే సంతోష్ మృతి చెందినట్లు చెబుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైందని.. ఆస్పత్రి యాజమాన్యం బాధ్యత వహించాలని కుటుంబాలు సభ్యులు ఆరోపిస్తున్నారు.
సరైన సమయానికి మెరుగైన వైద్యం అందించకపోవడంతోనే ప్రాణాలు కోల్పోయాడని ఆందోళనకు దిగారు. దీంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. హోంగార్డ్ సంతోష్ కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి వద్ద యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పహడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు .
