హైదరాబాద్ సిటీ పరిశుభ్రతపై జలమండలి దృష్టి సారించింది. రోడ్లపై మురికినీరు వదిలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సిటీలోని పలుచోట్ల మురుగు నీరు రోడ్లపై వదలడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదుల రావడంతో ఈ చర్యలకు దిగింది. రూల్స్ ఉల్లంఘించినవారిపై రూ. 15 వేల జరిమానా తప్పదని వార్నింగ్ ఇచ్చింది.
సోమవారం (జూలై27) సిటీ పరిధిలోని బంజారాహిల్స్ లో మురికి నీరు వీధుల్లో వదిలి ప్రజలకు అసౌకర్యం కలిగించిన ఐషారావు బ్రైడల్ వేర్ సంస్థకు రూ.15వేల జరిమానా విధించింది. సంస్థలో ఉన్న సంపు శుభ్రం చేసి మురుగునీటిని వీధుల్లో వదలడంతో దుర్వాసనతో , బురదతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై పలువురు స్థానికులు జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తనిఖీలు చేపట్టిన జలమండలి అధికారులు..ఘటనా స్థలంలో డీవాటరింగ్ సబ్ మెర్సిబుల్ పంపు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించాలని సంస్థ ప్రతినిధులకు జలమండలి హెచ్చరించింది.
►ALSO READ | టీవీఎస్ ఎక్సెల్ చోరీ చేసిన దొంగను పట్టించిన పిల్లలు: సీఐ అభినందన
నిబంధనలు ఉల్లంఘించి మురికి నీటిని రోడ్లపైకి విడుదల చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జలమండలి అధికారులు. డ్రైనేజీ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించబోమని అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
