హసన్ పర్తి,వెలుగు: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం యాదవ్నగర్లో టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని చోరీ చేసినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని స్థానిక బాలలు చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆదివారం మధ్యాహ్నం అనుమానాస్పదంగా టీవీఎస్ ఎక్సెల్పై తిరుగుతున్న వ్యక్తిని గమనించిన పిల్లలు అతడిని మాటల్లో పెట్టి అక్కడే నిలిపివేశారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు.
కానిస్టేబుల్ విద్యాసాగర్ సంఘటనా స్థలానికి చేరుకుని అనుమానితుడిని అదుపులోకి తీసుకుని హసన్పర్తి పీఎస్కు తరలించారు. పట్టుబడిన టీవీఎస్ ఎక్సెల్ వాహనం హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని నయీంనగర్ ప్రాంతంలో చోరీకి గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై ఇప్పటికే సుబేదారి పీఎస్లో కేసు నమోదైనట్లు సమాచారం. కాగా, దొంగను పట్టించడంలో అప్రమత్తత, ధైర్యసాహసాలు ప్రదర్శించిన బాలలను హసన్పర్తి సీఐ మహేందర్ ప్రత్యేకంగా అభినందించారు.
