తెలంగాణ తలసరి ఆదాయం.. జాతీయ సగటుకు డబుల్

తెలంగాణ తలసరి ఆదాయం.. జాతీయ సగటుకు డబుల్
  • 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం
  •     'క్యూర్-ప్యూర్-రేర్' సిస్టంతో రాష్ట్ర సమతుల్య అభివృద్ధి
  •     ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మల నేతృత్వంలో వికసిత్ భారత్ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •     30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నం
  •     దేశంలో తొలి నెట్-జీరో గ్రీన్ మెగాసిటీ ఏర్పాటు చేస్తామన్న భట్టి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే దాదాపు డబుల్ ఉందని, 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణాన్ని కేంద్రం, రాష్ట్రాలు విడివిడిగా సాధించలేవని, సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వనరులను సమర్థంగా సమీకరించడంతో పాటు బలమైన సంస్థలు, పరస్పర సహకార విధానాలు అవసరమన్నారు. తెలంగాణ కేవలం నిధులు కోరేందుకు కాకుండా, స్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక, ఆర్థిక వనరుల సమీకరణకు నిర్దిష్ట విధానం, దీర్ఘకాలిక లక్ష్యంతో ఈ చర్చలో భాగస్వామ్యమవుతోందని వెల్లడించారు. శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ‘వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి ఆర్థిక వనరుల సమీకరణ’ సదస్సు జరిగింది. వివిధ రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ నిర్మాణంలో రాష్ట్ర లక్ష్యాలను డిప్యూటీ సీఎం భట్టి వివరించారు.

రాష్ట్ర జీఎస్డీపీలో 10 శాతానికి పైగా వృద్ధి

తెలంగాణ బలమైన ఆర్థిక పునాదులతో తదుపరి దశ వృద్ధికి సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. 2025–26లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని, ప్రస్తుత ధరల ప్రకారం 10.7 శాతం వృద్ధి నమోదైందన్నారు. స్థిర ధరల ప్రకారం వాస్తవ జీఎస్డీపీ వృద్ధి 8.5 శాతంగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, ఇది జాతీయ సగటు రూ.2,19,575తో పోలిస్తే దాదాపు రెండింతలని వివరించారు. సేవల రంగం 13.5 శాతం, ద్వితీయ రంగం 9.4 శాతం వృద్ధి సాధించాయని తెలిపారు. ప్రస్తుత వృద్ధి పథంలో కొనసాగితే... 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1.21 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా ఉందన్నారు.  అయితే రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుందని స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పించామని ప్రకటించారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను ప్రస్తుతం ఉన్న దాదాపు 5 శాతం నుంచి 10 శాతానికి పెంచాలన్నది లక్ష్యమని తెలిపారు. రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వ రుణాలపైనే అధికంగా ఆధారపడే పద్ధతి నుంచి క్రమంగా మారాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రామీణ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌తో లింక్

అభివృద్ధి ఒకే నగరానికి పరిమితం కాకుండా... తెలంగాణ క్యూర్–ప్యూర్–రేర్ పేరుతో మూడు పరస్పర అనుసంధానిత ఆర్థిక ప్రాంతాలతో ప్రత్యేక అభివృద్ధి నమూనాను రూపొందించిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ మూడింటిని అనుసంధానించే కీలక మౌలిక వసతుల ప్రాజెక్ట్ ల్లో రీజినల్ రింగ్ రోడ్డు(త్రిపుల్ ఆర్) ప్రధానమైందన్నారు.  గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) ను అత్యున్నత సేవలు, కృత్రిమ మేధ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఫిన్‌టెక్, లైఫ్ సైన్సెస్, నాలెడ్జ్ ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాన రవాణా మార్గాల వెంట ప్యూర్(పెరి అర్బన్ రీజియన్) ను పారిశ్రామిక, తయారీ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఫైనల్ గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తీసుకురావడం కోసం రేర్(రూరల్ అగ్రికల్చర్ అండ్ రీసోర్స్ ఎకనామి)ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో డిజిటల్ సాంకేతికత వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల విస్తరణ, కోల్డ్‌చైన్ వ్యవస్థల ఏర్పాటు ద్వారా గ్రామీణ ఉత్పత్తిదారులను అధిక ఆదాయం అందించే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించనున్నట్లు చెప్పారు. 

ఏఐ ఆధారిత గ్రీన్​ మెగా సిటీగా ఫ్యూచర్​ సిటీ

దేశంలో భవిష్యత్ నగరాలకు నమూనాగా 30 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో తొలి నెట్‌జీరో, ఏఐ ఆధారిత గ్రీన్ మెగాసిటీగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాలు, క్లీన్ టెక్నాలజీ పార్కులు, పర్యావరణహిత నివాస ప్రాంతాలు ఇందులో భాగంగా ఉంటాయని వివరించారు.