- ఫ్రెండ్ పేరుతో సెంట్రో చెప్పుల వ్యాపారం
- ఆ సంస్థను అంబానీకి అమ్మేశారు
- జన్వాడ ఫాంహౌస్ లీజుకిచ్చినందుకు హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో పర్మిషన్లు
- ఖైరతాబాద్లో ముస్లిం ఓట్లతో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల కుట్ర
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన స్నేహితులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా భారీ క్విడ్ ప్రో కో దందాలకు పాల్పడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదని, ప్రాణ, ధన, దాన దోస్తులని ఎద్దేవా చేశారు. శనివారం జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సెంట్రో కంపెనీ పేరుతో ఒక ఫ్రెండ్తో కేటీఆర్ చెప్పుల బిజినెస్ పెట్టించిండు.. ఆయన రోజూ తిట్టే అంబానీకే ఆ వ్యాపారం అప్పగించిండు.. సత్యం భూముల్లోని జన్వాడ ఫామ్హౌస్ను ఇంకో ఫ్రెండ్ దగ్గర లీజుకు తీసుకున్నడు. ప్రతిఫలంగా హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో అతడి బిల్డింగ్కు అడ్డదారిలో పర్మిషన్లు ఇప్పించిండు. ఇంకో ఫ్రెండ్తో కొత్తూరులో లాజిస్టిక్ పార్క్ పెట్టించిండు. మరో ఫ్రెండ్తో హోటల్, వేరే ఫ్రెండ్తో మెడికల్ డివైజెస్ వ్యాపారం పెట్టించిండు.. వాళ్ల పేరు మీద వీటన్నింటి లాభాలు మాత్రం కేటీఆరే కొట్టేస్తున్నడు. ఖానాపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని నిజాం కాలేజీ ఫ్రెండ్కు టికెట్ ఇప్పించిండు. ఆయనలో తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నదంటూనే ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు అప్పగించిండు” అని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలను ఫాంహౌస్కు పంపడం డ్రామా
ఏఐసీసీకి కప్పం కట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూ దోపిడీలపై బీఆర్ఎస్తో బేరసారాలు మొదలుపెట్టిందని సంజయ్ ఆరోపించారు. అన్ని ఆధారాలున్నప్పటికీ చర్యలు తీసుకోకుండా.. కాంగ్రెస్ నేతలను ఫాంహౌస్కు పంపడం రాజకీయ డ్రామా మాత్రమేనని పేర్కొన్నారు. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమని, ముస్లిం ఓట్ల మద్దతుతో.. హిందూ ఓటర్లను విడదీసి గెలవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుట్ర చేస్తున్నాయన్నారు.
మోదీ పాలనలోనే ఉద్యోగాలు
ప్రధాని మోదీ మాట ఇస్తే తప్పరని, 10 లక్షల ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని బండి సంజయ్ తెలిపారు. పేపర్ లీకేజీలు, పైరవీలకు తావు లేకుండా మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వడం మోదీకే చెల్లిందన్నారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లీకేజీలు, కోర్టు కేసులతో భ్రష్టు పట్టిందని ఆరోపించారు. కేంద్రం నిధులు ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో పథకాలు మురిగిపోతున్నాయని, కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని సంజయ్ ఆరోపించారు.
