- యూఎస్ ఆర్డర్లు తగ్గే ప్రమాదం
- రష్యా చమురు రాక కష్టమే...
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన 'సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్'తో భారత ఎగుమతిదారులకు భారీ నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా నుంచి గత 12 నెలల్లో అత్యధికంగా క్రూడ్ ఆయిల్, గ్యాస్ కొన్న దేశాలపై వంద శాతం వరకు సుంకాలు విధించడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. రష్యా నుంచి చవక చమురు దిగుమతులు నిలిపివేయాలని అమెరికా భారత్పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. భారత్ ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్. 2026– 2027 ఏప్రిల్–ఆగస్టు మధ్య మన దేశం నుంచి అమెరికాకు జరిగిన ఎగుమతులు ఆరు శాతం పెరిగి రూ.3.55 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతుల విలువ 29 శాతం పెరిగి రూ.2.30 లక్షల కోట్లు అయింది.
గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యం విలువ రూ.11.15 లక్షల కోట్లు ఉంది. భవిష్యత్తులో ఈ వాణిజ్యాన్ని రూ.41.75 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న వేళ ఈ కొత్త చట్టం అడ్డంకిగా మారింది. ఎగుమతులపై 100 శాతం పన్ను విధిస్తే, అమెరికాలో భారతీయ వస్తువుల ధరలు అమాంతం రెట్టింపు అవుతాయి. దీంతో అమెరికా మన దగ్గర కొనడం ఆపేసే అవకాశాలే ఎక్కువ. ఎగుమతుల్లో వియత్నాం, బంగ్లాదేశ్, థాయ్లాండ్ వంటి దేశాల నుంచి గట్టి పోటీ ఉంది. ఇండియా వస్తువుల ధరలు పెరిగితే, అమెరికా కొనుగోలుదారులు వెంటనే ఆయా దేశాల వైపు చూస్తారు. యూఎస్కు ఎగుమతి అయ్యే వస్తువుల్లో ఫార్మా, ఇంజనీరింగ్, వజ్రాభరణాలు, ఆటో విడిభాగాలు, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు ఎక్కువ. టారిఫ్స్ వల్ల ఈ రంగాలపై ఆధారపడిన కంపెనీలు పాత ఆర్డర్లు కోల్పోతాయి. ఎంఎస్ఎంఈలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతాయి.
