హైదరాబాద్, వెలుగు: సదరన్ డిస్కమ్ పరిధిలో గడిచిన 32 నెలల కాలంలో రూ.828 కోట్లతో 71 వేల 11 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు సీఎండీ జితేష్ వి.పాటిల్ శనివారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ డీటీఆర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త కనెక్షన్లు, లోడ్ పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ పంపిణీ వ్యవస్థ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచామన్నారు.
వీటి ఏర్పాటుతో ఇప్పటికే ఉన్న ట్రాన్స్ఫార్మర్లపై అదనపు భారం తగ్గిందన్నారు. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్లు, లో-వోల్టేజ్ సమస్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని వివరించారు. వ్యవసాయ పంపుసెట్లకు మెరుగైన విద్యుత్ సరఫరాతో సాగునీటి అవసరాలు సకాలంలో తీర్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్ మెగా సిటీ, క్యూర్ పరిధిలో కొత్త కాలనీలు, అపార్ట్మెంట్ సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, పట్టణ విస్తరణకు అనుగుణంగా డీటీఆర్ల సంఖ్య పెరగడంతో విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుపడిందన్నారు.
