మహబూబ్ నగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరదప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 30వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. నీటి మట్టాన్ని నియంత్రించేందుకు16వేల 408 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.15 మీటర్లుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.909 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరాన్ని బట్టి నీటి విడుదల చేస్తున్నారు.
►ALSO READ | తాడిచెర్ల-2 ప్రాజెక్టును వేగవంతం చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కోరిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్
మరోవైపు ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లోని నాలుగు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు మరింత వరద వచ్చే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలకు సూచించారు.
