టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారన్న వార్త ప్రస్తుతం ఆయన అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. జులై 27న సోమవారం సాయంత్రం ఆయన భుజానికి స్వల్ప గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.
గాయం గురించి సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులు, వైద్యులు అప్రమత్తమయ్యారు. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని నిపుణుల వైద్య బృందం ఎన్టీఆర్కు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. భుజానికి తగిలిన గాయం త్వరగా నయమై, ఆయన పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు రెస్ట్ తప్పనిసరి అని డాక్టర్లు సూచించారని తెలిపింది.
అయితే అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటామని తెలిపింది. తారక్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మన ముందుకు రావాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
