వాషింగ్టన్: దాదాపు నాలుగున్నరేండ్లుగా సాగుతోన్న రష్యాఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు ఇరుదేశాలు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులను నిలిపివేయడానికి ఉక్రెయిన్ అంగీకరించిందని ఆయన తెలిపారు. అదే విధంగా ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆపడానికి కూడా రష్యా అంగీకరించిందని చెప్పారు.
ప్రపంచంలో ఇంధన ధరల పెరుగుదలకు ప్రధాన కారణం రష్యా-ఉక్రెయిన్ యుద్ధమేనని పేర్కొన్నారు. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఆగ్రహం వ్యక్తం చేసిన 24 గంటల్లోనే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతపై రష్యా గానీ, ఉక్రెయిన్ గానీ అధికారికంగా ప్రకటన చేయలేదు.
దాదాపు నాలుగున్నరేండ్లుగా యుద్ధంలో మునిగిపోయిన రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇటీవల మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. రష్యాలోని ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. కీవ్ దాడులకు రష్యా ధీటుగా స్పందిచడంతో ఇరుదేశాల మధ్య మళ్లీ దాడుల తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్
యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక రాయబారులను రష్యా, ఉక్రెయిన్కు పంపారు. అమెరికా ప్రతినిధుల బృందం మొదట రష్యా ఆ తర్వాత ఉక్రెయిన్లో పర్యటించి ఆయా దేశాల అధినేతలతో చర్చలు జరిపింది. ఇందులో భాగంగానే ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు ఇరుదేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
