బీజేపీ ఫ్లెక్సీలకు చలాన్లు... టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపించవా

బీజేపీ ఫ్లెక్సీలకు చలాన్లు... టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపించవా

జీహెచ్ఎంసీ అధికారులు కండువా లేని టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహా రెడ్డి, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిలు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను వెంటనే కక్ష పూరితంగా తొలగించే అధికారులకు అధికారపక్ష నేతలు పెట్టిన ప్లెక్సీలు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. అధికారుల తీరును నిరసిస్తూ.. గిన్నెలు కొడుతూ జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్షంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పేందుకు, ఇటీవలే ప్రధాన మంత్రి మోదీ నగరానికి వచ్చిన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

కానీ.. కొద్ది గంటల వ్యవధిలోనే ఫైన్ లు విధిస్తూ.. చలాన్లు పంపించారని తెలిపారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎందుకు కనిపించడం లేదని ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ కు కూడా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి అధికార పార్టీ ఫ్లెక్సీలను తొలగించకపోతే తామే వాటిని తొలగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మొర్చా రాష్ట్ర నాయకులు చింతల సురేందర్ తో పాటు మహిళ నాయకులు పాల్గొన్నారు.