పాక్​ గాజులు తొడుక్కుని కూర్చుందా: ఫరూఖ్ అబ్దుల్లా

పాక్​  గాజులు తొడుక్కుని కూర్చుందా: ఫరూఖ్  అబ్దుల్లా

శ్రీనగర్: పాక్  ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) భారత్​లో విలీనం అవుతుందని రక్షణ మంత్రి రాజ్​నాథ్  సింగ్  ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నేషనల్  కాన్ఫరెన్స్  లీడర్  ఫరూఖ్  అబ్దుల్లా అక్కసు వ్యక్తంచేశారు. శ్రీనగర్​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘పీవోకే భారత్​లో విలీనం అవుతుందని రాజ్ నాథ్  సింగ్  చెప్పారు. అది ఆయన అభిప్రాయం. కానీ, ఒక్క విషయం గుర్తుంచుకోండి. పాకిస్తాన్  ఏమీ గాజులు వేసుకొని కూర్చోలేదు. వాళ్ల దగ్గరా అణుబాంబులు ఉన్నాయి. మన దురదృష్టం కొద్దీ ఎప్పుడన్నా మన మీద ఆ బాంబులు వేయవచ్చు” అని ఫరూఖ్  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

కాగా, గత నెల బెంగాల్​లోని డార్జిలింగ్​లో జరిగిన ర్యాలీలో రాజ్​నాథ్  మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఏదో ఒకరోజు పీవోకే భారత్​లో విలీనం కాక తప్పదన్న పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘ఇండియా పవర్  రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా దూసుకుపోతున్నది. ఇలాంటి పరిణామాలను గమనిస్తే తమను భారత్​లో కలపాలని పీవోకే ప్రజలే డిమాండ్  చేసే రోజు వస్తుంది” అని రాజ్​నాథ్  చెప్పారు. అలాగే విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్​ కూడా పీవోకే భారత్​లో భాగమని ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.