దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ కక్ష కట్టారు:బూర నర్సయ్య గౌడ్

దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ కక్ష కట్టారు:బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి నల్గొండ, మహబూబ్​నగర్ జిల్లాలపై సీఎం కేసీఆర్ కక్ష కట్టారని, అందుకే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అటకెక్కడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికే కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని, ప్రజాక్షేత్రంలో కేసీఆర్ కు శిక్ష తప్పదని హెచ్చరించారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తవడంలో కేసీఆర్ పాత్ర ఉందని, కేబినెట్​లో చర్చించకుండానే 299 టీఎంసీల నీరు చాలంటూ అగ్రిమెంట్​పై సంతకం పెట్టింది కేసీఆర్ కదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారన్నారు.